Money Landering Case Jacqueline Fernandez: వ్యాపారవేత్త సుకేశ్ చంద్రశేఖర్కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు చుక్కెదురైంది. ఈ ముద్దుగుమ్మకు చెందిన రూ.7.27కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ సొమ్మును ఈడీ అటాచ్ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్, అతడి భార్య, నటి లీనా మరియా పాల్తో పాటు మరో ఆరుగురి పేర్లను ఛార్జ్షీట్లో చేర్చారు. చంద్రశేఖర్.. జాక్వెలిన్కు విలువైన కానుకలు ఇచ్చినట్లు గుర్తించి ఆమెను గతంలో పలు మార్లు విచారించారు అధికారులు.
![జాక్వెలిన్ ఫెర్నాండెజ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15157379_kdkd.jpg)
ఇదీ కేసు.. రాన్బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్కు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేశాడు సుకేశ్ చంద్రశేఖర్. శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది దిల్లీ ఆర్థిక నేరాల నిరోధక విభాగం(ఈఓడబ్ల్యూ). కేంద్ర న్యాయశాఖలోని ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుని వారిని మోసం చేసినట్లు తేల్చింది.
రూ.200 కోట్ల దోపిడీ కేసులో చంద్రశేఖర్ సన్నిహితుడు లీనా మరియా పాల్ సహా.. బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను ఈడీ ప్రశ్నించింది. తిహాడ్ జైలు నుంచే కాలర్ ఐడీ స్పూఫింగ్ ద్వారా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను సుకేశ్ చంద్రశేఖర్ సంప్రదించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్గాలు తెలిపాయి. తన గుర్తింపును దాచి పెట్టి, తనను తాను పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తిగా పరిచయం చేసుకుని ఆమెతో మాట్లాడేవాడని తెలుసుకున్నారు. అతడిని జాక్వెలిన్ నమ్మటం ప్రారంభించిన క్రమంలో.. ఖరీదైన పూలు, చాక్లెట్లు బహుమతిగా పంపేవాడని చెప్పారు. సుకేశ్కు సంబంధించిన 20కిపైగా కాల్ రికార్డులు ఈడీ దగ్గర ఉన్నట్లు అధికారులు తెలిపారు. రూ.200 కోట్ల దోపిడీ కేసులో దిల్లీ పోలీసు ఆర్థిక నేరాల నిరోధక విభాగం(ఈఓడబ్ల్యూ) విచారణ కొనసాగిస్తోంది. సుకేశ్ చంద్రశేఖర్, లీనా పాల్పై దేశవ్యాప్తంగా 23 చీటింగ్ కేసులు ఉన్నాయి.
ఇదీ చదవండి: 'కేజీయఫ్ 2' @1000కోట్లు.. 'ఆచార్య' తొలి రోజు వసూళ్లు ఎంతంటే?