Jailer Actor Passed Away : 'జైలర్' సినిమాలో కీలక పాత్ర పోషించిన తమిళ నటుడు మారిముత్తు తుది శ్వాస విడిచారు. 56 ఏళ్ల ఈ స్టార్ గుండెపోటు కారణంగా కన్నుమూశారు. ఓ సీరియల్కు డబ్బింగ్ చెప్తున్న సమయంలో ఆయన స్పృహ తప్పి పడిపోగా.. అది చూసిన సిబ్బంది అప్రమత్తమై ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఆయన మరణ వార్తతో కోలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగింది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు.
Marimuthu Jailer : 'జైలర్' సినిమాలో విలన్కు నమ్మకస్తుడిగా ఉండే పన్నీర్ అనే పాత్రలో మారిముత్తు నటించారు. తన విలక్షణ నటనతో అందరిని అబ్బురపరిచారు. 'విక్రమ్' సినిమాలో కూడా మారిముత్తు ఓ కీలక పాత్ర పోషించారు. ఓ కమెడియన్గా, ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన కెరీర్లో ఆయన ఇప్పటివరకు సుమారు 100కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఓ సహాయ దర్శకుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన మారిముత్తు .. ఆ తర్వాత నటుడిగా మారారు. మణిరత్నం, ఎస్జే సూర్య, వసంత సీమన్, లాంటి దర్శక నిర్మాతల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశారు. 1999లో తమిళ సినిమా 'వాలి'తో నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 2008లో వచ్చిన 'కన్నుమ్ కన్నుమ్' అనే చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆయన నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులో అనువాదమై పెద్ద విజయాల్ని అందుకున్నాయి.
Marimuthu Serials : తమిళ ఇండస్ట్రీలోని స్టార్స్, దర్శకులు, నిర్మాతలు ఇలా అందరితో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. వెండితెరపైనే కాకుండా బుల్లితెరలోనూ మారిముత్తు మంచి పేరు తెచ్చుకున్నారు. తమిళంలో ప్రసారమైన 'యాంటీ స్విమ్మింగ్' అనే సీరియల్లో నటించిన ఆయన.. తన నటనతో బుల్లితెర ఆడియెన్స్ను అలరించారు. అలా టీవీ రంగంలోనూ పాపులారిటీ సంపాదించుకున్నారు. 'ఎథిర్ నీచల్' సీరియల్లో ఆయన పోషించిన ఆదిముత్తు గుణశేఖరన్ పాత్రకు మంచి ప్రశంసలు అందుకున్నారు.
Spandana Death : ప్రముఖ నటి దివ్య స్పందన మృతిచెందారా?.. అసలు నిజమిదే
19రోజుల్లో మ్యారేజ్ డే.. గుండెపోటుతో నటుడి భార్య కన్నుమూత.. వెకేషన్లోనే..