Viveka Murder Case: వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన తనను అంతం చేయడానికి పులివెందులకు చెందిన వైకాపా నాయకులు కుట్ర పన్నుతున్నారని డ్రైవర్ దస్తగిరి ఆరోపించారు. గత కొద్ది రోజుల నుంచి తొండూరు మండలానికి చెందిన పెద్ద గోపాల్ అనే వ్యక్తి తరచూ తనతో.. తన కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆక్షేపించారు. నిన్న తన సోదరుడు మస్తాన్తో గొడవపడి తనను ఇష్టానుసారంగా బూతులు తిట్టడంతో పోలీస్ స్టేషన్కు వెళ్లానని.. పోలీసులు ఎదురుగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంతో అతనిపై తాను చేయి చేసుకున్నానని దస్తగిరి తెలిపారు. దాన్ని కారణంగా చూపి.. పోలీసులు తనపై కేసు నమోదు చేశారని దస్తగిరి వాపోయారు.
ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టారని దస్తగిరి తెలిపారు. ఇక్కడ జరిగిన విషయాలన్నిటిపై.. కడప ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి వచ్చానని దస్తగిరి తెలిపారు. ఈ మేరకు లిఖిత పూర్వకంగా రాసిన ఫిర్యాదు పత్రాన్ని ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. గత కొద్ది కాలంగా తనపై జరుగుతున్న కుట్ర విషయాలను సీబీఐ అధికారి రాంసింగ్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు దస్తగిరి పేర్కొన్నారు. తన ప్రాణాలకు ఏం జరిగినా వైకాపా నాయకులదే బాధ్యత అన్నారు.
తొండూరు మండలానికి చెందిన పెద్ద గోపాల్ రెడ్డి నాతో గొడవ పడుతున్నాడు. నన్ను లక్ష్యంగా చేసుకొని పెద్ద గోపాల్ ఘర్షణకు దిగుతున్నాడు. తొండూరు మండల వైకాపా నాయకులు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్నాననే నన్ను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదో విధంగా అంతం చేయాలనే ఉద్దేశంతోనే పన్నాగాలు పన్నుతున్నారు. నా ప్రాణాలకు ముప్పు ఉంది. అన్ని విషయాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకే కడప వచ్చా. తప్పుడు కేసు విషయాన్ని సీబీఐ ఎస్పీ రాంసింగ్కు కూడా వివరించాను. - దస్తగిరి, వివేకా కేసులో అప్రూవర్
ఇదీ చదవండి:
శునకం పైనుంచి దూసుకెళ్లిన కారు.. పాపం కుక్క విలవిల్లాడుతూ...