చిన్నప్పటి నుంచి వారు ముగ్గురు స్నేహితులు.. ‘ప్రేమ వ్యవహారం’ వారి మధ్య ముసలం పుట్టించి.. ఒకరిపై ఒకరు దాడి చేసుకొనేలా చేసింది.. చివరికి ఒకరు బ్లేడుతో గాయపర్చి అరెస్టయ్యేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. రహమత్నగర్లోని బంగారు మైసమ్మ ఆలయం వద్ద నివసించే సాయిచైతన్య(19) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థి. ఇతనికి 17 ఏళ్ల వయసు గల ఇద్దరు స్నేహితులున్నారు. వీరు ముగ్గురు చిన్నప్పటి నుంచి మిత్రులు. సాయిచైతన్య తన బంధువైన ఓ యువతి(17)ని ఇష్టపడ్డాడు. తన ప్రేమకు సాయం చేయాలని ఇద్దరు స్నేహితులను కోరాడు. వారు మద్దతు తెలిపారు. ఏడాదిగా ఇదే ప్రయత్నంలో ఉన్నారు. కొద్ది రోజుల కిందట ఆ యువతి సాయిచైతన్య ప్రేమను నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే, అతడి ఇద్దరు స్నేహితుల్లో ఒకరు.. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అంటూ ఆ యువతికి వాట్సాప్ సందేశం పంపాడు. ఆ యువతి నిరాకరించింది. మరో స్నేహితుడు సైతం ఆ యువతి ప్రేమ కోసం ప్రయత్నం చేశాడు. ఇది తెలుసుకున్న సాయిచైతన్య వారిని నిలదీశారు.
దీంతో ముగ్గురి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే నిమ్స్కు చెందిన నిర్జన ప్రాంతంలో తేల్చుకుందామంటూ ముగ్గురు సవాల్ విసురుకున్నారు. అక్కడ జరిగిన గొడవలో ఓ స్నేహితుడి మెడపై సాయిచైతన్య బ్లేడుతో దాడి చేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని అమీర్పేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అతడి ఫిర్యాదుతో సాయిచైతన్యను అదుపులోకి తీసుకుని బ్లేడును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు ఎస్సై పొనుగోటి యాదగిరిరావు చెప్పారు.
ఇదీ చదవండి: ఒకే కాన్పులో ముగ్గురు శిశువుల జననం... తల్లీబిడ్డలు క్షేమం