Bike Riders Halchal on Bangalore national highway: రోడ్డు ప్రమాదాలపై ట్రాఫిక్ పోలీసులు ఎంతగా హెచ్చరికలు జారీచేస్తున్నా కొందరు వాహనదారుల తీరుమారడం లేదు. నిర్లక్ష్య డ్రైవింగ్ ఇతరుల ప్రాణాలను బలితీసుకుంటోంది. జనారణ్య ప్రాంతాల్లో బైక్లపై ఫీట్లు వద్దని హెచ్చరిస్తున్నా.. కొందరు యువకుల అత్యుత్సాహం ఆపదను కొనితెచ్చుకునేలా చేస్తోంది. హైదరాబాద్లో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
రోడ్డు దాటుతుండగా
Accidents in hyderabad: నగరంలోని కూకట్పల్లిలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. రోడ్డు దాటుతున్న ఓబుల్రెడ్డి అనే వ్యక్తిని బైక్ ఢీ కొట్టింది. ఘటనలో ఓబుల్రెడ్డితో పాటు బైక్పై వెనక కూర్చున్న వహీద్కు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఇద్దరూ చనిపోయారు. ఇద్దరి మృతికి కారణమైన సదరు ద్విచక్ర వాహనదారుడు ప్రవీణ్పై పోలీసులు కేసునమోదు చేశారు. ప్రవీణ్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపినట్లు గుర్తించారు.
దూసుకెళ్లారు..
హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై బైక్ రైడర్లు హల్చల్ సృష్టించారు. పది బైక్లపై స్నేహితులంతా కలిసి రోడ్డుపై స్టంట్లు వేస్తూ శంషాబాద్ వైపు రయ్ మంటూ దూసుకెళ్లారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్ పైకి రాగానే బైక్ రైడర్ మైఖెల్ డివైడర్ను ఢీ కొట్టాడు. దీంతో దాదాపు వంద మీటర్ల వరకు బైక్తో పాటు మొఖేల్ ఈడ్చుకుంటూ వెళ్లిపోయాడు. ఘటనలో ద్విచక్రవాహనం పూర్తిగా దెబ్బ తినగా.. మైఖేల్కు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![road accidents in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14200007_bikle.png)
ఇదీ చదవండి: Accidents Yadadri District: పండుగ పూట నెత్తురోడిన రహదారులు.. వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి