ఏపీ విజయవాడకు చెందిన నిర్మాణరంగ సంస్థ ఎంకే కన్స్ట్రక్షన్స్ & డెవలపర్స్.. సుమారు 6 కోట్ల రూపాయల మేర కొనుగోలుదారుల నుంచి అడ్వాన్సులు వసూలు చేసి గుట్టుచప్పుడు కాకుండా బోర్డు తిప్పేసింది. రాజమహేంద్రవరానికి చెందిన శ్రీనివాసరావు.. గత ఆగస్టులో విజయవాడలో రియల్ ఎస్టేట్ సంస్థను ఏర్పాటుచేశారు. హైదరాబాద్ వనస్థలిపురంలోనూ బ్రాంచ్ తెరిచారు. నున్న గ్రామానికి చెందిన మనోజ్కుమార్ ఛైర్మన్గా, యద్దనపూడి వాసి రవితేజ సంస్థ డైరెక్టర్గా వ్యవహరించారు.
ప్లాట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో విల్లాల విక్రయానికి 20 మంది యువకులను ఏజెంట్లుగా నియమించుకుని.. ప్రతి విక్రయంలో 2 శాతం కమీషన్ ఇస్తామని నమ్మబలికారు. ఈ ముగ్గురూ కలిసి గన్నవరం, ముస్తాబాద, ఆగిరిపల్లి సహా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలు వెంచర్లను చూపించారు. అన్ని జిల్లాల్లో తిరిగిన ఏజెంట్లు.. విజయవాడ, గుంటూరు, కడప, శ్రీశైలం, విశాఖకు చెందిన వంద మంది నుంచి లక్షల్లో అడ్వాన్సులు తీసుకొచ్చారు.
కొనుగోలుదారులంతా రిజిస్ట్రేషన్ల కోసం పట్టుబట్టగా.. శ్రీనివాసరావు, మనోజ్, రవితేజపై ఏజెంట్లు ఒత్తిడి తెచ్చారు. ఇకఅంతే.. మార్చి నుంచి కార్యాలయానికి రాకపోకలు తగ్గించిన ఈ ముగ్గురు.. మే 2వ తేదీ నుంచి ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. గత నెల 24నే బాధితులు పోలీసులను ఆశ్రయించినా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
- ఇదీ చదవండి : ధైర్యంగా పోరాడారు.. పులిట్జర్ గెలిచారు