హైదరాబాద్కు చెందిన దుర్గాప్రసాద్ ఓ భూ వివాదం కేసును వాదించేందుకు వరంగల్ కోర్టుకు తన కారులో బయలుదేరారు. జనగామ జిల్లా యశ్వంత్పూర్ వద్ద హైకోర్టు న్యాయవాది దుర్గాప్రసాద్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓ లారీ వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. కారును లారీ కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ప్రమాదం నుంచి న్యాయవాది దుర్గాప్రసాద్ సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఇది ప్రమాదం కాదని.. తనను హత్య చేయడానికి జరిగిన ప్రయత్నమని ఆయన ఆరోపించారు.
లారీతో ఢీకొట్టించి నన్ను చంపే ప్రయత్నం చేశారు. భూవివాదం కేసులో హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న నన్ను.. జనగామ నుంచి ఓ లారీ వెంబడించింది. నా కారును ఢీకొట్టడమే కాక 200 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. లారీ ఇంజిన్ ఆగడం వల్ల దుండగులు పారిపోయేందుకు యత్నించారు. స్థానికులు దుండగులను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. బ్రేక్ ఫెయిలే కారణమని దుండగులు అబద్ధం చెబుతున్నారు. నన్ను లక్ష్యంగా చేసుకుని లారీతో దాడి చేయించారు. ఇలాగైతే న్యాయవాద వృత్తినే వదులుకోవాలి.
-దుర్గాప్రసాద్, హైకోర్టు న్యాయవాది
ప్రమాదంపై హైకోర్టు న్యాయవాది దుర్గాప్రసాద్ జనగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. న్యాయవాది ఫిర్యాదుతో కేసునమోదుచేశామని.. జనగామ పట్టణ సీఐ మల్లేశ్ తెలిపారు.
ఇవీచూడండి: పట్టపగలే ఘాతుకం: ఉలిక్కిపడేలా చేసిన న్యాయవాద దంపతుల హత్యోదంతం