Fire Accidents: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోనే ఇవాళ ఒక్క రోజే రెండు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ట్రాన్స్ఫార్మర్ దగ్ధం
అకస్మాత్తుగా ట్రాన్స్ఫార్మర్లో మంటలు చెలరేగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల గ్రామంలోని శ్రీధర ఎత్తిపోతల పథకానికి అనుసంధానంగా ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్లో ఉన్న ఓ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఫెయిలై మంటలు చెలరేగాయి. శ్రీధర ఎత్తిపోతల పథకం పంపు ఆపరేటర్ ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకున్న మంథని అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ అగ్ని ప్రమాదంలో ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా దగ్ధం కాగా, భారీ ప్రమాదం తప్పింది. ట్రాన్స్ఫార్మర్ విలువ సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదం ఎండల వల్ల జరిగిందా లేదా సాంకేతిక లోపమా తెలియాల్సి ఉంది.
డంపర్కు అంటుకున్న మంటలు
పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లోని సింగరేణి ఓసీ-3 ఉపరితల గనిలో ప్రమాదవశాత్తు బొగ్గును రవాణా చేస్తుండగా డంపర్కు మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు మంటలను ఆర్పివేశారు. మంటలు అదుపులోకి రావడంతో అధికారులు, ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాగా మార్చి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఉపరితల గనుల్లో రక్షణ చర్యలు చేపట్టి ఎప్పటికప్పుడు బొగ్గుపై నీటిని చల్లి ప్రమాదాలు జరగకుండా ఎండాకాలం పూర్తయ్యేవరకు రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే సింగరేణిలో తరచూ అగ్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుందని కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: