చిరుత దాడిలో లేగదూడ మృతి చెందిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది. వాజేడు మండలం దూలాపురం కొంగాల సరిహద్దులో లేగదూడ కళేబరాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దూలాపురం, కొంగాల గ్రామాల మధ్యలోనున్న జామాయిల్ తోటల్లో పశువులు మేతకు వెళ్లగా.. చిరుత దాడి చేసి లేగదూడను చంపేసింది.
మెడపై గాయాలు, దెబ్బలు గుర్తించిన అధికారులు చిరుతేనని నిర్ధారించారు. గ్రామస్థులు అడవుల్లోకి వెళ్లవద్దని.. చిరుతకు ఎలాంటి హాని తలపెట్టవద్దని అటవీశాఖ అధికారులు సూచించారు. చిరుత దాడిలో ఆవులు, దూడలు, ఇతర జంతువులు గాయపడినా, మృతిచెందినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.