భూతగాదా విషయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారంలో జరిగిన హత్యల కేసులో నిందితులను పట్టుకునేందుకు.. పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వ్యవసాయ పనులు చేసుకుంటుండగా 9 మంది వచ్చి కళ్లలో కారం చల్లి గొడ్డళ్లతో అతికిరాతకంగా నరికి చంపారన్న మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. డీఎస్పీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో గ్రామంలో క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు.
అన్ని కోణాల్లో...
దారుణ హత్యకు దారి తీసింది... భూ తగాదాల వల్లనేనా..? లేదా వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇరు వర్గాల మధ్య హత్యకు గల కారణాలు.. ఇతర అంశాలపై ప్రత్యక్ష సాక్షులను విచారించారు. హత్యకు ముందు నిందితులు ఎక్కడెక్కడ తిరిగారు.. అన్న కోణంలో విచారిస్తున్నారు. ఇరు కుటుంబాల మధ్య గొడవలపై బంధువులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అయితే.. దాడికి పాల్పడిన వారిలో కొందరు పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. విచారణలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వారిని మహదేవ్పూర్ సర్కిల్ కార్యాలయానికి తీసుకెళ్లినట్లు తెలిసింది.
ఇదీ జరిగింది..
పొలం హద్దుల విషయంలో గత కొంత కాలంగా రెండు కుటుంబాల మధ్య గొడవ జరుగుతోంది. దీనికి సంబంధించి మరోసారి మాట్లాడుకునేందుకు పొలం వద్ద... రెండు కుటుంబాలు సమావేశమయ్యారు. మాటామాటా పెరిగి గొడవ తారాస్థాయికి చేరడంతో.. మంజూ నాయక్, ఆయన కుమారులు సారయ్య, భాస్కర్ల కళ్లల్లో కారం చల్లి.. ప్రత్యర్థులు గొడ్డలితో దాడి చేశారు. వారు ఘటనా స్థలంలోనే మృతి చెందారు.
ఇదీ చూడండి: TRIPLE MURDER: వ్యవసాయ భూమిలో త్రిపుల్ మర్డర్