నగర శివారు హయత్నగర్లోని విలువైన భూమిని సొంతం చేసుకునేందుకు ఓ ముఠా ఎత్తుగడ వేసింది. పాత రిజిస్ట్రేషన్ పత్రాలు సంపాదించి వాటిపై అసలు భూమి యజమాని పేరుతో ఉన్న మరో వ్యక్తిని హక్కుదారుడుగా చూపారు. స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు రిజిస్ట్రార్ కార్యాలయం తిరస్కరించడంతో న్యాయస్థానం ద్వారా స్వాహా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అసలు విషయం బయటకు రావటంతో మాయగాళ్లపై కేసు నమోదైంది.
నకిలీ పత్రాలతో..
గ్రేటర్ పరిధిలో నకిలీ పత్రాలు సృష్టించి భూములు సొంతం చేసుకునే ముఠాల ఆగడాల్లో ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. కొందరు నేరచరిత్ర గల వ్యక్తులు, మరికొందరు స్థిరాస్తి వ్యాపారులు, న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా సలహాలిచ్చే నిపుణుల కనుసన్నల్లో విలువైన స్థలాలను కాజేయడం వీరి ప్రత్యేకత. వారసత్వ, వివాదాస్పద స్థలాలు, ప్రభుత్వ భూములు లక్ష్యంగా అక్రమార్కులు చేసే చీకటి కార్యకలాపాలకు దళారులు సాయపడుతున్నారు. కొందరు డాక్యుమెంట్ రైటర్లు, రెవెన్యూ, రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కమీషన్లకు కక్కుర్తిపడే సిబ్బంది పాతస్టాంప్ పేపర్లను డిమాండ్ను బట్టి విక్రయిస్తుంటారు. డబీర్పుర, ఘాన్సీబజార్, చార్మినార్, పురానాహవేలి, ముషీరాబాద్, బంజారాహిల్స్, పటాన్చెర్వు , సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో పాత, నకిలీ పత్రాలు విరివిగా లభిస్తాయని సమాచారం.
పసిగట్టడం కష్టమే
ఇటీవల షేక్పేట్ మండలంలోని బంజారాహిల్స్లో రూ.150 కోట్ల విలువైన భూమికి హక్కుదారుణ్ని తానేనంటూ పాత స్టాంపు పేపర్ల ద్వారా టైటిల్డీడ్ పొందిన వ్యక్తి రెవెన్యూ అధికారుల సాయంతో నిరంభ్యంతర పత్రం(ఎన్వోసీ) కోసం ప్రయత్నించాడు. ఈ వ్యవహారంలో లంచం తీసుకుంటున్న తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లను పట్టించాడు. తరువాత దర్యాప్తు చేపట్టిన పోలీసులు హక్కుదారుడిగా చెబుతున్న వ్యక్తి వద్ద ఉన్న పత్రాలు నకిలీవిగా గుర్తించి కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
దందా రేంజ్ అది..
హైదరాబాద్ జిల్లాలోని సుమారు 1000-1200 వరకూ ఉన్న భూ వివాద సమస్యల్లో 400 వరకూ నకిలీ పత్రాలు ఉండవచ్చని రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. నకిలీవిగా నిర్ధారించటం కొన్నిసార్లు సవాల్గా మారుతోందని ఆవేదన వెలిబుచ్చారు. 1960-80 మధ్యలో ఉన్న స్టాంపు పేపర్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. స్థలవిలువను బట్టి ఒక్కో స్టాంపు పేపర్ రూ.10,000 నుంచి రూ.లక్ష వరకూ పలుకుతుందంటే దందా ఏ స్థాయిలో సాగుతుందనేది అర్ధం చేసుకోవచ్చని ఓ సీఐ తెలిపారు. కొన్నిసార్లు కోర్టుల ఉత్తర్వులతో భూమిపై హక్కు పొంది దర్జాగా విక్రయించుకున్న వ్యక్తులూ ఉన్నారని తన అనుభవాన్ని వివరించారు. భూ రికార్డులపై అవగాహన, చట్టాలపై పట్టు ఉన్న నేరచరిత్ర గల వ్యక్తులే ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతుంటారని విశ్లేషించారు. నకిలీ పత్రాలతో కొందరు బ్యాంకుల నుంచి రూ.కోట్లల్లో రుణాలూ తీసుకుంటున్నారు.
ఇదీ చూడండి: మాట కలిపి.. మాయ చేసి.. ఆపై పోలీసులను..!