బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్కు (Gangula Kamalakar) నకిలీ ఈడీ నోటీసులు జారీ అయినట్లు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈడీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నకిలీ ఈడీ నోటీసుల గురించి సైబర్ క్రైం పోలీసులు మంత్రి గంగుల కమలాకర్ను సంప్రదించగా... తనకు అలాంటి నోటీసులేమీ రాలేదని చెప్పడం కొస మెరుపు.
ఓ కంపెనీకి సంబంధించిన లావాదేవీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని... మీ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయాల్సి ఉంటుందని... ఈడీ పేరుతో మంత్రి గంగుల కమలాకర్కు (Gangula Kamalakar) నోటీసులు వెళ్లాయి. అరెస్ట్ చేయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని మంత్రిని డిమాండ్ చేసినట్లు కూడా తెలిసింది. దీంతో అనుమానం వచ్చిన మంత్రి గంగుల... ఈడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా తమ కార్యాలయం నుంచి అలాంటి నోటీసులేవీ రాలేదని తేలింది.
ఈడీ అధికారులు వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రికి వచ్చిన ఫోన్ గురించి సైబర్ క్రైం పోలీసులు ఆరా తీయగా... ఇంటర్నెట్ ద్వారా చేసినట్లు గుర్తించారు. నకిలీ ఈడీ లేఖ గురించి మంత్రి గంగుల (Gangula Kamalakar)స్పందించకపోవడంతో... సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తునకు ఆటంకం ఏర్పడింది. లేఖ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి : పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా... రూ.5 కోట్లకు ఆశపడి 25లక్షలు పొగొట్టుకుంది!