దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన భాజపా రాష్ట్రంలో రాబోయే ఎన్నికలపై దృష్టిసారించింది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ పోరుకు సన్నద్ధమవుతోంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇవాళ వరంగల్లో పర్యటించనున్నారు. స్థానిక నేతలు ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో పాల్గొననున్నారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన నేతలు బండి సంజయ్ సమక్షంలో భాజపాలో చేరనున్నారు.
వ్యూహాలపై చర్చ..
వరంగల్ జిల్లాకు చెందిన పలువురు కీలకనేతలతో సమావేశమై కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. వ్యక్తిగత పనుల నిమిత్తం బండి సంజయ్ రేపు దిల్లీ వెళ్లనున్నారు. ఎల్లుండి నిజామాబాద్ జిల్లాలో పర్యటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అదే రోజు హైదరాబాద్కు లోక్సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా రానున్న నేపథ్యంలో బండి నిజామాబాద్ పర్యటన వాయిదాపడే అవకాశం లేకపోలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఖమ్మం కార్పొరేషన్కు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు బండి సంజయ్ ఈ నెల 9న ఖమ్మం పర్యటనకు వెళ్లనున్నారు. పార్టీ ముఖ్యనేతలతో పార్టీ పరిస్థితి, బలోపేతం విజయావకాశాలపై చర్చించనున్నారు.
భాజపా కార్పొరేటర్లతో లక్ష్మణ్ సమావేశం..
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన భాజపా కార్పొరేటర్లతో నేడు ఆ పార్టీ ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ సమావేశం కానున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు బేగంపేటలోని హరితా ప్లాజాలో కార్పొరేటర్లకు దిశానిర్థేశం చేయనున్నారు. అధికార పార్టీ ప్రలోభాలకు లోనుకాకుండా ఏ నమ్మకంతో ప్రజలు గెలిపించారో వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని సూచించనున్నారు.
ఇవీ చూడండి: 'పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియను నెలాఖరులోపు పూర్తి చేయాలి'