తనపై పోలీసు అధికారులు దురుసుగా ప్రవర్తించారని ఎంపీ బండి సంజయ్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కరీంనగర్ ఇన్ఛార్జి పోలీస్ కమీషనర్ సత్యనారాయణ వివరణ ఇచ్చారు. ఆర్టీసీ డ్రైవర్ బాబు మృతదేహాన్ని ఆరేపల్లి నుంచి బస్టాండ్ వైపు తీసుకొస్తే శాంతిభద్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉందన్న సమాచారంతోనే ర్యాలీని అడ్డుకున్నట్లు ఆయన తెలిపారు. ర్యాలీలో పెద్ద ఎత్తున జనాలు ఉన్నందున... ఎంపీ సంజయ్ మీద ఎవరు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నామే తప్ప... ఎవరి పట్ల దురుసుగా ప్రవర్తించలేదన్నారు. ఈ సంఘటనపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని తెలిపారు. ఇప్పటికే ఐజీ స్థాయి అధికారితో విచారణకు డీజీ ఆదేశించారని సీపీ వెల్లడించారు. ఈ ఘటనలో పోలీసు విధులకు ఆటంకం కలిగించినందుకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. శవాన్ని పోలీసులు ఎత్తుకెళ్లి దహన సంస్కారాలు చేశారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తమకు సాంప్రదాయాలు తెలుసని... శాంతిభద్రతలను కాపాడటం తప్ప ఇతర పనులు చేయాల్సిన అవసరం తమకు లేదని సీపీ తెలిపారు.
ఇవీ చూడండి: పవర్ స్టార్ అభిమానులు పండుగ చేసుకునే వార్త..