Inspection at Karimanagar Hotels : కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని హోటళ్లలో... హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక స్క్వాడ్ బృందాలు ఆహార తనిఖీల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాయి. మహబూబ్నగర్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ఫుడ్ ఇన్స్పెక్టర్ల తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. ఇద్దరు చొప్పున ఇన్స్పెక్టర్లు మరో ఐదుగురు అధికారులు మొత్తం 10 మంది వరకు వేర్వేరు చోట్ల తనిఖీలను నిర్వహించారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని పేరొందిన నాలుగు హోటళ్లలో ఆందోళనకర పరిస్థితులు బయటపడ్డాయి.
చికెన్తోపాటు రోజువారీగా వినియోగించే చాలా ఆహార పదార్థాలను ఫ్రిజ్లలో నిల్వ ఉంచిన తీరుని గుర్తించి వాటిని పారవేయించారు. ఇలాంటి ఆహార పదార్ధాలను విక్రయించడం, నిల్వచేయడం సరికాదని హెచ్చరించారు. రుచికోసం వాడుతున్న వాటి నమూనాలను తీసుకున్నారు. నూనెలతో పాటు ప్రతి నిత్యావసర సరకుల నాణ్యతను గమనిస్తూనే వాటి గడువు తేదీని పరిశీలించారు. అంతేకాకుండా ఆరు కిరాణ దుకాణాల్లోకి వెళ్లి అమ్ముతున్న వాటి అసలు తీరుని పరిశీలించారు. నిర్ణీత తేదీ దాటిన వాటిని గుర్తించి వాటిని తొలగించేలా చేశారు.
Hotels Inspection in Karimanagar : ముఖ్యమైన హోటళ్లతోపాటు ఆహార భద్రత పరిధిలోకి వచ్చే పలు దుకాణాల్లో ముమ్మరంగా అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 16 నమూనాలను సేకరించి ల్యాబ్కు తీసుకెళ్లారు. దాదాపుగా వీటన్నింటి వల్ల ముప్పు ఉందనేలా అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ల్యాబ్కు పంపించిన తర్వాత మరో 15 రోజుల్లో వీటి ఫలితం తేలుతుందని అధికారులు తెలిపారు. స్థానికంగా ఉన్న అధికారులను కాదని ప్రత్యేకంగా వచ్చిన బృందాలు ఇక్కడి శుచి, శుభ్రత్ర, నాణ్యత, భద్రతలపై దృష్టి సారించడం స్థానికంగా కలకలాన్ని సృష్టించింది.
"చాలా హానికరమైన శాంపిల్స్ సేకరించాం. చాలా హోటళ్లలో హానికర పదార్థాలనే వాడుతున్నారు. ఆహారం కూడా నాణ్యంగా లేవు. ఈ శాంపిళ్లను ల్యాబ్కు పంపించాం. కానీ ఈ తనిఖీల ద్వారా మాకు అర్థమైంది ఏంటంటే.. నగరంలోని ఏ హోటల్ కూడా పరిశుభ్రంగా లేదు. ఇక్కడ భోజనం చేసే కస్టమర్లకు ఆరోగ్య సమస్యలు తప్పవనిపిస్తోంది. ఈ హోటళ్లపై మేం తగిన చర్యలు తీసుకుంటాం."
- ధర్మేంద్ర, గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, హైదరాబాద్
unhygienic hotels in Karimanagar : కరీంనగర్ జిల్లాలో కరోనా విపత్తు తరువాత తినుబండారాల దుకాణాలతోపాటు ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు, హోటళ్లు పదుల సంఖ్యలో పెరిగిపోయాయి. ఎందులో కల్తీ దాగుందనే విషయమై చేసే తనిఖీలు అన్నిచోట్ల మొక్కుబడిగానే మారాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇద్దరు ఫుడ్ ఇన్స్పెక్టర్లతో మాత్రమే తూతూమంత్రంగా తనిఖీలు కానిస్తున్నారు. రెవెన్యూ వారికి ప్రశ్నించే అధికారంతోపాటు పరిశీలించే వెసులబాటున్నప్పటికీ ఏ ఒక్కచోట వీరు పట్టించుకున్న దాఖలాలు లేవన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి.