రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు లేకుండా ఉండాలనే.. తెలంగాణలో వైకాపాను స్థాపించలేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణలో పార్టీ పెడతానని వైఎస్ షర్మిల గతంలోనే చెప్పారని.. అందుకే ఆమె పార్టీ ఏర్పాటు చేశారని అన్నారు.
వైఎస్ షర్మిల పార్టీ గురించి తాము మాట్లాడాల్సిన అవసరం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రెవేటికరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశామని ఆయన తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేయాల్సింది అంతా చేస్తోందని మరోసారి సజ్జల స్పష్టం చేశారు.
తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటు
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భావానికి రంగం సిద్ధమైంది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో జెండా, అజెండాను వెల్లడించనున్నారు. ఇవాళ ఉదయం వైఎస్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానానికి తన తల్లి విజయమ్మ నుంచి ఆశీర్వాదం లభించిందని షర్మిల ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: