గురుకుల విద్యాసంస్థల్లో దశాబ్దానికిపైగా పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులతోపాటు ఇతర ఉద్యోగులను క్రమబద్ధీకరించకపోవడం శ్రమ దోపిడీయేనని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రతి ఏటా కాంట్రాక్ట్ కింద వారిని నియమించుకుని, వేసవి సెలవుల్లో తొలగించడం అధికార దుర్వినియోగమేనని తెలిపింది. 2003 నుంచి ఇలా సర్వీసులో బ్రేక్ ఇస్తూ నియామకం చేపడుతుండటంతో వారి వయోపరిమితి దాటిందని, ప్రస్తుతం వారు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించింది. సర్వీసులు రెగ్యులర్గా అవసరమైనపుడు వారిని ఎందుకు క్రమబద్ధీకరించరాదని అడిగింది.
కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించరాదని, వేతన బకాయిలను చెల్లించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో తప్పేముంది? సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమల్లో భాగంగా చేపట్టే శాశ్వత నియామకాల్లో 18 నుంచి 20 సంవత్సరాలు సేవలందించినవారికి మినహాయింపులు కల్పించండి. ఏం మినహాయింపులు ఇస్తారో చెప్పండి అంటూ విచారణను ఆగస్టు 11వ తేదీకి వాయిదా వేసింది.
రాష్ట్రంలోని పలు గురుకులాల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లు, పీఈటీలుగా విధులు నిర్వహిస్తున్న పి.వెంకటరమణ మరో 11 మంది వేసవి సెలవుల్లో వారిని తొలగించడంపై పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన సింగిల్ జడ్జి వారిని విధుల నుంచి తొలగించరాదని ఉత్తర్వులు ఇచ్చారు. వాటిని సవాలు చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. దానిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించింది.
సర్వీసులో బ్రేక్ ఇస్తున్నారు..
ప్రభుత్వం తరపు న్యాయవాది వాణిరెడ్డి వాదనలు వినిపిస్తూ సేవలు అవసరమైనంత వరకు వారిని వినియోగించుకున్నామని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించరాదంటూ ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందన్నారు. దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ మీరు రెగ్యులర్గా నియామకాలు చేపట్టకుండా సర్వీసులో బ్రేక్ ఇస్తున్నారని.. ఇది ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారని వ్యాఖ్యానించింది. రెగ్యులర్గా వారి సర్వీసులు అవసరం లేనపుడు తిరిగి వేసవి సెలవుల అనంతరం వారిని ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. సేవలు అవసరం అయినప్పుడు వేసవి సెలవుల్లో ఎందుకు తొలగిస్తున్నారని నిలదీసింది. అన్ని అర్హతలున్న వారిని క్రమబద్ధీకరించరాదని ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదంది.
ఇది శ్రమదోపిడియే..
ఇది శ్రమదోపిడియేనని ప్రభుత్వం ఇలా చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. మీ నిర్ణయాల వల్ల వారు కాంట్రాక్ట్ పద్దతిలోనే దశాబ్దాలుగా పనిచేస్తున్నారని వారిని తిరిగి మీరే దొడ్డిదారిన నియామకాలకు ప్రయత్నిస్తున్నారని అనడం సరికాదంది. మీ కారణంగా వారి వయోపరిమితి దాటిందని ఇప్పుడు వారు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించింది. అప్పీళ్లను కొట్టివేస్తామనగా ఈ దశలో ప్రభుత్వ తరపు న్యాయవాది జోక్యం చేసుకుంటూ వారిని క్రమబద్ధీకరణకు ప్రభుత్వానికి సలహా ఇస్తామన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ కాంట్రాక్ట్ పద్దతిలో ఇన్నేళ్లు సేవలందించిన వారికి అర్హతలు, వయసులో మినహాయింపులు పరిశీలించాలని ఏం మినహాయింపులు ఇస్తున్నారో చెప్పాలంటూ విచారణను వాయిదా వేసింది.
ఇవీ చూడండి: Cyber Crime: సహకార బ్యాంక్లో రూ. 1.96కోట్లు కొల్లగొట్టిన నైజీరియన్