సెప్టెంబరు 2న జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని తెరాస శ్రేణులకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. జెండా పండుగ, పార్టీ సంస్థాగత నిర్మాణంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ ఛైర్మన్లు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, సర్పంచులతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాలు, పట్టణాలలోని వార్డుల్లో పార్టీ జెండాను ఎగురవేయాలన్నారు. అదే రోజు దిల్లీలో పార్టీ కార్యాలయ భవనం ప్రారంభోత్సవానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు హాజరవుతున్నందున.. స్థానిక నాయకత్వమే జెండా పండుగ విజయవంతం చేయాలన్నారు.
"స్థానిక నాయకత్వమే జెండా పండగను విజయవంతం చేయాలి. సెప్టెంబరు 2 నుంచి 12 వరకు గ్రామ, వార్డు కమిటీల నియామకం జరుగుతుంది. 12 నుంచి 20 వరకు మండల, పట్టణ కమిటీల నియామకం.. ఆ తర్వాత జిల్లా కార్యవర్గాల ఎంపిక, జిల్లా అధ్యక్షుల ఎంపిక జరుగుతుంది. వచ్చే నెల 2న దిల్లీలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన జరుగుతుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు." - కేటీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు
జెండా పండుగ తర్వాత వెంటనే పార్టీ సంస్ధాగత నిర్మాణం ప్రారంభించాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. సెప్టెంబర్ 2 నుంచి 12వ వరకు గ్రామ, వార్డు కమిటీలు..సెప్టెంబర్ 12 నుంచి 20 వరకు మండల, పట్టణ కమిటీలను నిర్మాణం పూర్తి చేయాలన్నారు. సెప్టెంబర్ 20 తర్వాత జిల్లా అధ్యక్షుడు, కార్యవర్గాలను ప్రకటించనున్నట్లు తెలిపారు. జిల్లా కార్యవర్గాల ఎంపిక తర్వాత రాష్ట్ర కార్యవర్గాన్ని ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటిస్తారని కేటీఆర్ వివరించారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉన్నవారికే కమిటీల్లో చోటు ఉండాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారని తెలిపారు.
తెరాస పార్టీ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కచ్చితంగా 50 శాతం ఉండాలని, లేకపోతే ఆ కమిటీలు చెల్లవన్నారు. పార్టీ అనుబంధ కమిటీలతో పాటు గ్రామ, మండల స్థాయి సోషల్ మీడియా కమిటీలు కూడా ఉంటాయన్నారు. మండల కమిటీల ఏర్పాటు తర్వాత గ్రామ స్ధాయి సోషలు మీడియా కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్లో బస్తీ, డివిజన్ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. సెప్టెంబర్ తొలి వారంలో హైదరాబాద్ నగర తెరాస ప్రత్యేక సమావేశం ఉంటుందని తెలిపారు.
ఇదీ చూడండి: