ETV Bharat / city

రైతన్నల నేస్తాలు... ఈ స్టార్టప్‌లు!

ఆర్థిక సమస్యలూ, ప్రకృత్తి విపత్తులు ఎన్నింటినో ఎదుర్కొంటూ రెక్కలు ముక్కలు చేసుకునే అన్నదాతల గురించి ఆలోచించారు కొందరు యువకులు. వారి కోసమే స్టార్టప్‌లు పెట్టి మేలు చేసే యంత్రాల్ని తయారు చేస్తున్నారు... గిట్టు బాటు ధర కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. మరి ఇంతకీ ఆ స్టార్టప్‌లు ఏంటంటే...

author img

By

Published : Aug 23, 2020, 10:40 AM IST

startup
startup

ఫామ్‌ నుంచి ఇంటికి

కోళ్లను స్వేచ్ఛగా పెంచి గుడ్లను పెట్టించే ప్రక్రియను విదేశాల్లో ఎక్కువగా అవలంబిస్తారు. దీన్నే ఫ్రీరేంజ్‌ విధానం అంటారు. ఇప్పుడిప్పుడే ఈ విధానం మనదేశానికి కూడా విస్తరిస్తోంది. ఈ మధ్య మెదక్‌ జిల్లాలోని చండీ గ్రామానికి చెందిన అచ్యుత రెడ్డి తన పొలంలోనే ఫ్రీ రేంజ్‌ పద్ధతిలో కోళ్ల ఫామ్‌ను ఏర్పాటు చేశాడు. ఈ విధానంలో కోళ్లు ఫామ్‌ అంతటా స్వేచ్ఛగా తిరుగుతాయి. ఎండా, గాలీ సక్రమంగా తగిలి రోగనిరోధక శక్తి పెరిగి అవి రోగాల బారిన పడకుండా ఉంటాయి. వాటికి హార్మోన్లు, యాంటీబయాటిక్‌ ఇంజక్షన్లు కూడా చేయాల్సిన పనుండదు.

అలా పెరిగిన కోళ్ల నుంచి వచ్చే గుడ్లలో పోషకవిలువలు అధికం. ముఖ్యంగా ల్యూటిన్‌, జియాజాంథిన్‌ అనే మేలు చేసే పోషకాలు దండిగా ఉంటాయి. అందుకే ఈ గుడ్లను ‘ఫామ్‌ టూ టేబుల్‌’ పేరిట అన్‌లైన్‌లో అమ్ముతూ వినియోగదారుల ఇళ్ల వద్దకే పంపుతున్నాడు అచ్యుత రెడ్డి. అలానే ఆ చుట్టుపక్కల రైతుల ఉత్పత్తులు దళారుల చేతిలోకి వెళ్లకుండా వాటికి కూడా మార్కెటింగ్‌ కల్పిస్తున్నాడు. ‘కిసాన్‌ శక్తి’ పేరిట మరో స్టార్టప్‌ను ప్రారంభించి... ఆన్‌లైన్‌లో ధాన్యాలు, తృణధాన్యాలు, బెల్లం, నూనె, పాలు, ఇతర డెయిరీ ఉత్పత్తులను అమ్ముతున్నాడు. ఆ చుట్టుపక్కల చదువుకున్న ·యువతకు కూడా తన స్టార్టప్‌ల ద్వారా ఉపాధి కల్పిస్తున్నాడు.

పండ్ల చిప్స్‌ ప్రత్యేకం

నూనె, చక్కెర వంటివి లేకుండా పండ్లూ, కూరగాయలతో రకరకాల రుచుల్లో చిప్స్‌ అందిస్తున్నాడు భరద్వాజ్‌ కరంత్‌. కర్ణాటకలోని చిక్‌మగళూరు జిల్లాలోని శృంగేరికి చెందిన భరద్వాజ్‌ ఆ ప్రాంతంలోనే పీజీ వరకూ చదివి కొంత కాలం ఓ కాలేజీలో లెక్చరర్‌గానూ పనిచేశాడు. అయితే రైతు కుటుంబం నుంచి వచ్చిన భరద్వాజ్‌ అక్కడ కొన్ని సమస్యల్ని గుర్తించాడు. బొప్పాయి, అరటి, పనస, మామిడి వంటి వాటితోపాటు కూరగాయలు కూడా బాగా పండే ఆ ప్రాంతానికి మార్కెట్‌ దూరంగా ఉండటంతో పంటల్ని దళారులకి అమ్మేస్తున్నారు. దాంతో గిట్టుబాటు కాని రైతులకి న్యాయం చేయాలని నిర్ణయించుకుని నాలుగేళ్ల క్రితం ‘కరంత్‌’ పేరిట ఓ స్టార్టప్‌ని ప్రారంభించి ‘ఫ్రూట్‌ ట్రీట్‌’ పేరుతో చిప్స్‌ అందిస్తున్నాడు.

నూనెల అవసరం లేకుండా చిప్స్‌ తయారు చేయడానికి వియత్నాం నుంచి యంత్రాలను తెప్పించాడు. అలానే అరటి, పనస, సపోటా, బొప్పాయి, మామిడి, చిలగడ దుంపలు, బెండ, వెల్లుల్లి తదితరాలను రైతుల నుంచి కొని వాటితో చిప్స్‌ తయారు చేస్తున్నాడు. కృత్రిమ రంగులు, నిల్వ పదార్థాలు కలపకుండా సహజ రుచిని కోల్పోకుండా చూస్తున్నాడు. ఈ చిప్స్‌ కేఫ్‌ కాఫీ డే, విమానాశ్రయాల్లోని అవుట్‌లెట్లతోపాటు ఈకామర్స్‌ సైట్‌ బిగ్‌బాస్కెట్‌లో అందుబాటులో ఉంచాడు. అంతేకాదు, బెంగళూరులోని దాదాపు 100 ఐటీ సంస్థల ఉద్యోగులకు ప్రతి రోజూ అందిస్తున్నాడు. అలానే దుబాయ్‌, అబుదాబీ, ఇస్తాంబుల్‌ వంటి చోట్లకు వాటిని ఎగుమతి చేస్తున్నాడు.

రైతన్నకో డ్రోన్‌

పంటలు చీడపీడల్ని తట్టుకుని మంచి దిగుబడినివ్వాలంటే రసాయనాలు చల్లాలి. కానీ వాటిని పిచికారీ చేసే క్రమంలో రైతులు క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక సమస్యల బారిన పడుతున్నారు. అందుకే వాళ్లని ఆ సమస్య నుంచి తప్పించడానికే పురుగు మందుల్ని పిచికారీ చేసే డ్రోన్లకు శ్రీకారం చుట్టాడు కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన గోపీ రాజా. ‘ఫోపెల్‌ టెక్నాలజీ’ పేరుతో స్టార్టప్‌ పెట్టి డ్రోన్లను తయారు చేసి రైతులకు అమ్మడం, అద్దెకివ్వడం వంటివి చేస్తున్నాడు. రాజా ఆలోచన వెనక అసలు కారణమేంటంటే... ఓ రోజు పొలం పనులు చేసుకుని ఇంటికి తిరిగొచ్చిన అతని తండ్రి అనారోగ్యం పాలయ్యాడు. వెంటనే డాక్టర్‌ దగ్గరకు తీసుకెళితే పురుగు మందులు చల్లడం వల్ల అలా అయిందని చెప్పారు. అంతేకాదు, ఆ మందుల ప్రభావం వల్ల క్యాన్సర్‌ కూడా వస్తుందని అప్పుడే తెలుసుకున్నాడు రాజా. దాంతో రసాయనాలు చల్లే యంత్రాన్ని కనిపెట్టాలని నిర్ణయించుకున్నాడు.

ఇంజినీరింగ్‌లో ఉండగానే కొందరు స్నేహితులతో కలిసి ఈ డ్రోన్ల తయారీ మీద దృష్టి పెట్టాడు. అందుకోసం తన తల్లి బంగారం తాకట్టుపెట్టి వచ్చిన డబ్బులతో దాదాపు మూడేళ్లు కష్టపడి 10, 15 లీటర్ల సామర్థ్యమున్న రెండు రకాల డ్రోన్లను తయారు చేశాడు. వీటితో రోజుకు 50-70 ఎకరాల్లో మందులు పిచికారీ చేయొచ్చు. వీటితో ఇప్పటి వరకూ వేల మంది రైతులకు చేరువై కూలీల కొరతకు ప్రత్యామ్నాయం కూడా చూపుతున్నాడు.

ఫామ్‌ నుంచి ఇంటికి

కోళ్లను స్వేచ్ఛగా పెంచి గుడ్లను పెట్టించే ప్రక్రియను విదేశాల్లో ఎక్కువగా అవలంబిస్తారు. దీన్నే ఫ్రీరేంజ్‌ విధానం అంటారు. ఇప్పుడిప్పుడే ఈ విధానం మనదేశానికి కూడా విస్తరిస్తోంది. ఈ మధ్య మెదక్‌ జిల్లాలోని చండీ గ్రామానికి చెందిన అచ్యుత రెడ్డి తన పొలంలోనే ఫ్రీ రేంజ్‌ పద్ధతిలో కోళ్ల ఫామ్‌ను ఏర్పాటు చేశాడు. ఈ విధానంలో కోళ్లు ఫామ్‌ అంతటా స్వేచ్ఛగా తిరుగుతాయి. ఎండా, గాలీ సక్రమంగా తగిలి రోగనిరోధక శక్తి పెరిగి అవి రోగాల బారిన పడకుండా ఉంటాయి. వాటికి హార్మోన్లు, యాంటీబయాటిక్‌ ఇంజక్షన్లు కూడా చేయాల్సిన పనుండదు.

అలా పెరిగిన కోళ్ల నుంచి వచ్చే గుడ్లలో పోషకవిలువలు అధికం. ముఖ్యంగా ల్యూటిన్‌, జియాజాంథిన్‌ అనే మేలు చేసే పోషకాలు దండిగా ఉంటాయి. అందుకే ఈ గుడ్లను ‘ఫామ్‌ టూ టేబుల్‌’ పేరిట అన్‌లైన్‌లో అమ్ముతూ వినియోగదారుల ఇళ్ల వద్దకే పంపుతున్నాడు అచ్యుత రెడ్డి. అలానే ఆ చుట్టుపక్కల రైతుల ఉత్పత్తులు దళారుల చేతిలోకి వెళ్లకుండా వాటికి కూడా మార్కెటింగ్‌ కల్పిస్తున్నాడు. ‘కిసాన్‌ శక్తి’ పేరిట మరో స్టార్టప్‌ను ప్రారంభించి... ఆన్‌లైన్‌లో ధాన్యాలు, తృణధాన్యాలు, బెల్లం, నూనె, పాలు, ఇతర డెయిరీ ఉత్పత్తులను అమ్ముతున్నాడు. ఆ చుట్టుపక్కల చదువుకున్న ·యువతకు కూడా తన స్టార్టప్‌ల ద్వారా ఉపాధి కల్పిస్తున్నాడు.

పండ్ల చిప్స్‌ ప్రత్యేకం

నూనె, చక్కెర వంటివి లేకుండా పండ్లూ, కూరగాయలతో రకరకాల రుచుల్లో చిప్స్‌ అందిస్తున్నాడు భరద్వాజ్‌ కరంత్‌. కర్ణాటకలోని చిక్‌మగళూరు జిల్లాలోని శృంగేరికి చెందిన భరద్వాజ్‌ ఆ ప్రాంతంలోనే పీజీ వరకూ చదివి కొంత కాలం ఓ కాలేజీలో లెక్చరర్‌గానూ పనిచేశాడు. అయితే రైతు కుటుంబం నుంచి వచ్చిన భరద్వాజ్‌ అక్కడ కొన్ని సమస్యల్ని గుర్తించాడు. బొప్పాయి, అరటి, పనస, మామిడి వంటి వాటితోపాటు కూరగాయలు కూడా బాగా పండే ఆ ప్రాంతానికి మార్కెట్‌ దూరంగా ఉండటంతో పంటల్ని దళారులకి అమ్మేస్తున్నారు. దాంతో గిట్టుబాటు కాని రైతులకి న్యాయం చేయాలని నిర్ణయించుకుని నాలుగేళ్ల క్రితం ‘కరంత్‌’ పేరిట ఓ స్టార్టప్‌ని ప్రారంభించి ‘ఫ్రూట్‌ ట్రీట్‌’ పేరుతో చిప్స్‌ అందిస్తున్నాడు.

నూనెల అవసరం లేకుండా చిప్స్‌ తయారు చేయడానికి వియత్నాం నుంచి యంత్రాలను తెప్పించాడు. అలానే అరటి, పనస, సపోటా, బొప్పాయి, మామిడి, చిలగడ దుంపలు, బెండ, వెల్లుల్లి తదితరాలను రైతుల నుంచి కొని వాటితో చిప్స్‌ తయారు చేస్తున్నాడు. కృత్రిమ రంగులు, నిల్వ పదార్థాలు కలపకుండా సహజ రుచిని కోల్పోకుండా చూస్తున్నాడు. ఈ చిప్స్‌ కేఫ్‌ కాఫీ డే, విమానాశ్రయాల్లోని అవుట్‌లెట్లతోపాటు ఈకామర్స్‌ సైట్‌ బిగ్‌బాస్కెట్‌లో అందుబాటులో ఉంచాడు. అంతేకాదు, బెంగళూరులోని దాదాపు 100 ఐటీ సంస్థల ఉద్యోగులకు ప్రతి రోజూ అందిస్తున్నాడు. అలానే దుబాయ్‌, అబుదాబీ, ఇస్తాంబుల్‌ వంటి చోట్లకు వాటిని ఎగుమతి చేస్తున్నాడు.

రైతన్నకో డ్రోన్‌

పంటలు చీడపీడల్ని తట్టుకుని మంచి దిగుబడినివ్వాలంటే రసాయనాలు చల్లాలి. కానీ వాటిని పిచికారీ చేసే క్రమంలో రైతులు క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక సమస్యల బారిన పడుతున్నారు. అందుకే వాళ్లని ఆ సమస్య నుంచి తప్పించడానికే పురుగు మందుల్ని పిచికారీ చేసే డ్రోన్లకు శ్రీకారం చుట్టాడు కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన గోపీ రాజా. ‘ఫోపెల్‌ టెక్నాలజీ’ పేరుతో స్టార్టప్‌ పెట్టి డ్రోన్లను తయారు చేసి రైతులకు అమ్మడం, అద్దెకివ్వడం వంటివి చేస్తున్నాడు. రాజా ఆలోచన వెనక అసలు కారణమేంటంటే... ఓ రోజు పొలం పనులు చేసుకుని ఇంటికి తిరిగొచ్చిన అతని తండ్రి అనారోగ్యం పాలయ్యాడు. వెంటనే డాక్టర్‌ దగ్గరకు తీసుకెళితే పురుగు మందులు చల్లడం వల్ల అలా అయిందని చెప్పారు. అంతేకాదు, ఆ మందుల ప్రభావం వల్ల క్యాన్సర్‌ కూడా వస్తుందని అప్పుడే తెలుసుకున్నాడు రాజా. దాంతో రసాయనాలు చల్లే యంత్రాన్ని కనిపెట్టాలని నిర్ణయించుకున్నాడు.

ఇంజినీరింగ్‌లో ఉండగానే కొందరు స్నేహితులతో కలిసి ఈ డ్రోన్ల తయారీ మీద దృష్టి పెట్టాడు. అందుకోసం తన తల్లి బంగారం తాకట్టుపెట్టి వచ్చిన డబ్బులతో దాదాపు మూడేళ్లు కష్టపడి 10, 15 లీటర్ల సామర్థ్యమున్న రెండు రకాల డ్రోన్లను తయారు చేశాడు. వీటితో రోజుకు 50-70 ఎకరాల్లో మందులు పిచికారీ చేయొచ్చు. వీటితో ఇప్పటి వరకూ వేల మంది రైతులకు చేరువై కూలీల కొరతకు ప్రత్యామ్నాయం కూడా చూపుతున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.