ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో కరోనాతో మరణించిందని అనుకున్న వృద్ధురాలు తిరిగి రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. క్రిస్టియన్ పేటలో ఉండే ముత్యాల గిరిజమ్మ(75)కు కరోనా సోకడంతో మే 12న చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. గిరిజమ్మ భర్త గడ్డయ్య రోజూ ఆసుపత్రికి వెళ్లి ఆమెకు కావాల్సిన వస్తువులు అందజేసి తిరిగి ఇంటికి వచ్చేవాడు. మూడు రోజుల తర్వాత (మే 15న) ఆసుపత్రికి వెళ్లి చూడగా.. బెడ్పై గిరిజమ్మ కనిపించలేదు. ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించగా.. వేరే వార్డుకు మార్చారేమో చూసుకోమని పంపేశారు. అన్ని వార్డులు తిరిగి ఎక్కడా లేకపోవడంతో.. మళ్లీ ఆస్పత్రి సిబ్బందిని అడగ్గా.. శవాగారంలో చూడాలని సమాధానమిచ్చారు. మార్చురీలో పొరపాటున గిరిజమ్మను పోలి ఉన్న వేరే శవాన్ని చూసి తన భార్యేనని గడ్డయ్య ఖరారు చేయడంతో ఆసుపత్రి సిబ్బంది మరణ ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేశారు. మృతదేహాన్ని జగ్గయ్యపేట తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. గిరిజమ్మ కుమారుడు రమేశ్ కరోనాతో గత నెల 23న మృతి చెందాడు. వీరిద్దరికీ కలిపి మంగళవారం పెద్దకర్మ చేశారు.
అందరూ చనిపోయిందని భావించిన గిరిజమ్మ.. ఉన్నట్టుండి జగ్గయ్యపేటలో ప్రత్యక్షమయ్యింది. ఆటోలో నేరుగా ఇంటికి రావడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. తాను ఆస్పత్రిలో చేరి 3 వారాలు గడిచిందనీ.. కోలుకున్నట్లు వైద్యులు చెప్పి.. ఇంటికి వెళ్లిపొమ్మన్నారని గిరిజమ్మ చెబుతున్నారు. తాను కోలుకున్నా.. బంధువులు ఎవరూ తీసుకెళ్లటానికి రాకపోవడంతో తానే స్వయంగా.. ఇంటికి వచ్చినట్లు తెలిపారు.
కరోనాతో చనిపోయిందని అనుకున్న వృద్ధురాలు ఇంటికి తిరిగిరావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ చోద్యాన్ని చూసేందుకు గిరిజమ్మ ఇంటికి గ్రామస్థులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
ఇదీ చదవండి: Covid Effect: కొమ్మ కొమ్మకో కన్నీటి చెమ్మ.. జగమంత కుటుంబంపై వైరస్ పంజా