హైదరాబాద్ బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. జులై మొదటి వారంలో ఫ్లైఓవర్ను ప్రారంభించనున్నారు. 2017లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా రూ.387 కోట్లతో శంకుస్థాపన చేయగా... ఎట్టకేలకు మూడున్నరేళ్ల అనంతరం నిర్మాణం పూర్తయింది.
ఇక్కడ ట్రాఫిక్ జామ్ అంటే హడలే..
నగరంలో అతిప్రధాన రహదారుల్లో ఒకటి బాలానగర్. అక్కడ ట్రాఫిక్ జామ్ అంటే ప్రజలు నరకంగా భావిస్తారు. కిలోమీటర్ వ్యవధిలో ఉండే ఫతేనగర్ సిగ్నల్ నుంచి బాలానగర్ సిగ్నల్.. దాటాలంటే సుమారు అరగంట పాటు వేచి చూడాల్సిన పరిస్థితి. వీటన్నింటికి చెక్ పెడుతూ.. ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకుని మంత్రి కేటీఆర్ రూ.387 కోట్లతో 2017లో శంకుస్థాపన చేయగా... కరోనా ప్రభావం వల్ల పూర్తవడానికి సుమారు మూడున్నరేళ్లు పట్టింది. 1.13 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ ఫ్లైఓవర్ ఆరు లైన్లతో ఎస్ఆర్డీపీ సౌజన్యంతో హెచ్ఎండీఏ ఈ వంతెనను నిర్మించింది.
ప్రయాణీకులకు ఉపశమనం..
బోయిన్పల్లి నుంచి కూకట్పల్లి వైపు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండు సిగ్నళ్లను కలుపుతూ ఈ నిర్మాణం చేపట్టారు. అదే విధంగా జీడిమెట్ల వైపు వెళ్లేవారికి సైతం ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయి. గత 20 ఏళ్లుగా బాలానగర్ నగర్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని స్థానికులు, ప్రయాణికుల నుంచి విజ్ఞప్తులు వచ్చినా.. ఎవరు పట్టించుకోలేదని, తెరాస ప్రభుత్వ హయాంలోనే ఈ వంతెన నిర్మాణం జరిగిందని బాలానగర్ కార్పొరేటర్ రవీందర్ రెడ్డి తెలిపారు. ఇన్నిరోజులు ట్రాఫిక్తో సతమతమైన స్థానికులు, ప్రయాణీకులు వంతెన పూర్తికావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: viral: మేకను మింగేసిన 15 అడుగుల కొండచిలువ