వివాదాస్పద భూముల పరిష్కారంలో జోక్యం చేసుకుంటే బెదిరింపులు తప్పడం లేదంటూ హైదరాబాద్కు చెందిన ఓ రెవెన్యూ అధికారి ఆందోళన వ్యక్తం చేశారు. తాను బాధ్యతలు చేపట్టిన ఏడాదిన్నర కాలంలో ప్రతిరోజూ భూముల వ్యవహారాల్లో రెండు కోర్టు కేసుల విచారణకు హాజరవుతున్నానంటూ ఓ తహసీల్దార్ తన అనుభవాన్ని వివరించారు. క్షేత్రస్థాయిలో కొందరు సర్వేయర్లు, ఆర్ఐలు సరైన సమాచారం ఇవ్వకుండా అధికారులను తప్పుదారి పట్టిస్తుంటారని తెలిపారు.
ఉంటారా.. బదిలీపై వెళ్తారా..
హైదరాబాద్ జిల్లా పరిధిలో 16 రెవెన్యూ మండలాలు ఉన్నాయి. 1971-75 మధ్యలో హైదరాబాద్ పట్టణ సర్వే నిర్వహించారు. సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్లోని రెండు మండలాల్లో కొన్ని సాంకేతిక కారణాలతో సర్వే జరగలేదు. ఇప్పటి వరకూ ఆ మండలాల్లో ఇనాం, ప్రభుత్వ, ప్రైవేటు, గ్రామకంఠం భూములు ఎక్కడ ఉన్నాయనేది గుర్తించడం సవాల్గా మారింది. షేక్పేట్, ముషీరాబాద్, బండ్లగూడ, మారేడుపల్లి, నాంపల్లి, గోల్కొండ మండలాల్లో భూముల ధరలు భారీగా పెరిగాయి. కాస్త జాగా సంపాదిస్తే చాలు జీవితంలో స్ధిరపడిపోవచ్చు అనేంతగా ముద్రపడింది.
పట్టణ పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూక్రమబద్ధీకరణ కొందరు అక్రమార్కులకు వరంగా మారింది. నాలుగైదు మండలాల్లో కొందరు దీనిని అవకాశంగా చేసుకుని పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాలను కలిపేసుకున్నారు. వాటిపై హక్కుదారులము తామేనంటూ కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఇంకొందరు స్థానిక నేతలు, ప్రజాప్రతినిధుల సహాయంతో ఉన్నతాధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. సర్కారు స్థలాలను కాపాడేందుకు ఎవరైనా అధికారులు సిద్ధమైతే బెదిరింపులకూ పాల్పడుతున్న ఘటనలూ ఉన్నాయి. ఇటీవల ఓ ప్రజాప్రతినిధి తన నియోజకవర్గంలో నాలుగైదుచోట్ల విలువైన స్థలాలపై కన్నేశారు. తహసీల్దార్ జోక్యం చేసుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు నేత తనకు ఎదురు తిరిగితే బదిలీ చేయిస్తానంటూ బెదిరించడం గమనార్హం.
కొంతైనా కాపాడదాం
ఉన్నతస్థాయి ఆదేశాలతో రెవెన్యూ వర్గాలు క్షేత్రస్థాయి పరిశీలనకు సిద్ధమయ్యాయి. రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సర్వేయర్లు, వీఆర్ఓల ద్వారా వివాదాస్పద స్థలాల సమాచారం సేకరిస్తున్నారు. భూ క్రమబద్ధీకరణ లబ్ధిదారుల నివాసాల పక్కన ఉన్న స్థలాల వివరాలను సర్వే చేయించనున్నారు. వివాదాస్పద భూముల పరిస్థితి. న్యాయస్థానాల్లో కేసులు, ఆయా భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ భూమిగా అధికారులు నిర్ధారించి, సరైన రికార్డులు ఉన్నట్టయితే న్యాయస్థానాల్లో కౌంటర్ ఫైల్ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఉన్నతాధికారులు ఆదేశించినట్టు తెలుస్తోంది. కొద్దిరోజులుగా రెవెన్యూ సిబ్బంది ఇదే పనిలో నిమగ్నమై ఉన్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.
గ్రేటర్ పరిధిలో కొద్దిరోజులుగా చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు పెరిగాయి. లాక్డౌన్ సమయాన్ని కబ్జాదారులు దర్జాగా సద్వినియోగం చేసుకున్నారు. వీటిపై భారీగా ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వ భూములను కాపాడేందుకు సిద్ధమైంది. ఇటీవల కబ్జాలకు గురైన స్థలాల వెనుక ఉన్న నేతలు, ప్రజాప్రతినిధుల సమాచారాన్ని నిఘా వర్గాలు ప్రభుత్వానికి అందజేసినట్టు సమాచారం.