ఐటీఐ విద్యార్థులకు ఓఎంఆర్ పద్ధతిలో కాకుండా.. కంప్యూటర్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించడం సరైన పద్ధతి కాదని తెలంగాణ ప్రైవేట్ ఐటీఐ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ఆరోపించింది. సుత్తెలు, కట్టింగ్ ప్లేయర్ వంటి వాటితో పని చేసుకొనే వారికి... కంప్యూటర్పై అవగాహన ఏ విధంగా ఉంటుందని అసోసియేషన్ అధ్యక్షుడు అఫ్సర్ పాషా హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రశ్నించారు. కంప్యూటర్ పరీక్ష విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన స్టేను దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 20 లక్షల మంది వృత్తి నైపుణ్యం పెంచుకునేందుకు ఐటీఐ చదువుతున్నారని పేర్కొన్నారు. వీరు నేర్చుకున్న వృత్తి నైపుణ్యంతో వివిధ దేశాలలో ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. ఐటీఐ విద్యార్థులను కంప్యూటర్ ఎగ్జామ్ రాస్తేనే అర్హులని డీజీఈటీ ప్రకటించడం దారుణమన్నారు.
డీజీఈటీ వ్యవహరిస్తున్న తీరు వల్ల లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డీజీఈటీ పరీక్ష విధానాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించేందుకు టెండర్లను పిలిచారని... దీనిపై నలుగురు కాంట్రాక్టర్లు సుప్రీంకోర్టుకు వెళ్లగా ఈ వ్యవహారం స్టేలో ఉందన్నారు. ఇప్పటికైనా డీజీఈటీ తన వైఖరిని మార్చుకొని... విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. కొవిడ్ నేపథ్యంలో ఇతర తరగతులను ఏవిధంగా అయితే పాస్ చేశారో... అదేవిధంగా 2018 బ్యాచ్కు చెందిన విద్యార్థులను ఎటువంటి పరీక్ష విధానం లేకుండా పాస్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'పురాతన కోట... సుందరపార్కుగా మారింది'