ఎంసెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్కు మొత్తం 2,19,410 దరఖాస్తులు అందాయి. గతేడాది కంటే ఈసారి రెండు వేలకుపైగా దరఖాస్తులు పెరిగాయి. ఇంజినీరింగ్కు 750 తగ్గగా.. అగ్రికల్చర్కు 2,961 దరఖాస్తులు పెరిగాయి. దరఖాస్తు గడువు బుధవారంతో ముగిసింది. రూ. 10,000 ఆలస్య రుసుంతో ఈనెల 30 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది.
విద్యార్థులు దరఖాస్తుల్లో పొందుపరిచిన వివరాల్లో ఏవైనా తప్పులుంటే ఈ నెల 11 నుంచి 16 వరకు సవరించుకోవచ్చు. ఈ నెల 22 నుంచి జులై 3 వరకు వెబ్సైట్ నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జులై 6 నుంచి ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలు మొదలవుతాయి.
ఇంజినీరింగ్కు 5 విడతల్లో పరీక్షలు
ఎంసెట్ ఇంజినీరింగ్ను జులై 6, 7 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం, 8వ తేదీన ఉదయం పరీక్ష నిర్వహిస్తారు. అగ్రికల్చర్ పరీక్షను జులై 8వ తేదీ మధ్యాహ్నం, 9వ తేదీన ఉదయం, మధ్యాహ్నం జరపాలని ఎంసెట్ అధికారులు నిర్ణయించారు.
సీబీఎస్ఈ విద్యార్థులకు జులై 8న
సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులకు మిగిలిపోయిన పరీక్షలను సీబీఎస్ఈ నిర్వహిస్తోంది. వారికి జులై 7వ తేదీన పరీక్ష ఉంది. అదేరోజు ఎంసెట్ ఉన్నందున వారికి ఇబ్బంది లేకుండా 8వ తేదీన రాసేలా అవకాశం ఇస్తామని ఎంసెట్ కన్వీనర్ ఆచార్య గోవర్ధన్ తెలిపారు. మొత్తం 1800 మంది సీబీఎస్ఈ విద్యార్థులు ఎంసెట్కు దరఖాస్తు చేశారు.