50 వేల ఉద్యోగాల భర్తీ ఆమోదమే ప్రధాన అజెండాగా రాష్ట్ర మంత్రివర్గం (Telangana cabinet) భేటీ అయింది. జోనల్ విధానంలో మార్పులు, చేర్పులకు ఆమోదం లభించిన నేపథ్యంలో ఖాళీల భర్తీకి కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. భూములు, రిజిస్ట్రేషన్ల(registrations) ధరల పెంపుపైనా సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏపీతో కృష్ణా జలాలవివాదం(water disputes), కరోనా స్థితిగతులు (corona), పల్లె, పట్టణప్రగతి, వ్యవసాయం సంబంధిత అంశాలపైనా మంత్రివర్గంలో చర్చించనున్నారు.
ఉద్యోగాల భర్తీ(jobs notification) అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. జోనల్ వ్యవస్థలో మార్పులు, చేర్పులకు ఆమోదముద్ర నేపథ్యంలో ఉద్యోగాల భర్తీకి అడ్డంకులు తొలిగిపోయాయని, తక్షణమే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. యాభై వేల నియామకాలను నేరుగా భర్తీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి కేబినెట్కు నివేదించాలని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ఆర్థికశాఖ రెండు రోజుల పాటు అన్ని శాఖల అధికారులతో సమావేశమై కసరత్తు పూర్తి చేసింది. వాటన్నింటినీ క్రోడీకరించి ఖాళీలకు సంబంధించిన నివేదికను సిద్ధం చేశారు. అన్ని శాఖల్లో కలిపి 55వేలకు పైగా ఖాళీలున్నట్లు సమాచారం. వీటితో పాటు పదోన్నతుల ద్వారా వచ్చే ఖాళీలు, కారుణ్య నియామకాలు తదితరాలకు సంబంధించిన వివరాలను సిద్ధం చేశారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా ఒకదాని తర్వాత ఒకటి ఉండేలా నోటిఫికేషన్లు జారీ చేసేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.