విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సాయంత్రం మహాగర్జనకు సర్వం సిద్ధమైన వేళ.. శ్రీనివాసరావు అనే ప్లాంట్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటానంటూ రాసిన లేఖ కలకలం రేపుతోంది. గాజువాకకు చెందిన శ్రీనివాసరావు.. ఉక్కు ఫర్నేస్లో అగ్నికి ఆహుతవుతానంటూ రాసిన లేఖ తోటి ఉద్యోగులకు లభ్యమైంది. ఈ లేఖపై పోలీసులు, కార్మికులు వివరాలు సేకరిస్తున్నారు. శ్రీనివాసరావు ఉదయం 5 గంటల షిఫ్ట్కు ప్లాంట్కు వెళ్లినట్లు తెలుస్తోంది.
లేఖలో ఏముందంటే?
‘‘ ప్రియమైన కార్మిక సోదరులారా.. మనందరం కలసికట్టుగా ఉంటేనే ఈ పోరాటంలో విజయం సాధించగలం. ఈరోజు జరగబోయే ఉక్కు కార్మిక మహాగర్జన ఒక మైలు రాయిగా నిలిచిపోవాలి. 32 మంది ప్రాణత్యాగాల ప్రతిఫలం ఈ ఉక్కు కర్మాగారం. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం కానివ్వొద్దు. నేను నా ప్రాణాన్ని ఉక్కు ఉద్యమం కోసం త్యాగం చేస్తున్నాను. ఈరోజు ఫర్నేస్లో అగ్నికి ఆహుతి కావడానికి సాయంత్రం 5.49 గంటలకు ముహూర్తం. ఈ పోరాటంలో ప్రాణత్యాగం నా నుంచి మొదలు కావాలి. జై హింద్’’ అని శ్రీనివాసరావు లేఖలో పేర్కొన్నారు.
రంగంలోకి పోలీసులు..
శ్రీనివాసరావు ఆచూకీ గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తోటి ఉద్యోగుల నుంచి శ్రీనివాసరావుకి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు తీసుకున్నారు. రెండు ప్రధాన ద్వారాల వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని సైతం స్టీల్ ప్లాంట్ భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించగా.. శ్రీనివాసరావు ఆచూకీ అందులో లభ్యం కానట్లు తెలుస్తోంది. డబ్ల్యూఆర్ఎం విభాగంలో ఇన్స్ట్రుమెంటేషన్ ఉద్యోగిగా శ్రీనివాసరావు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ విభాగంలోని ఫర్నేస్ లో మనిషి మండేందుకు అవకాశం ఉండదని స్టీల్ ప్లాంట్ సిబ్బంది చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ అంతటా శ్రీనివాసరావు ఆచూకీ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.
- ఇదీ చదవండి : తెలంగాణ భవన్లో అగ్నిప్రమాదం.. తప్పిన ఆస్తినష్టం