ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రంలో శ్రీ రామ నవమి సందర్భంగా వేకువ జాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతీ ఏడాది రాములోరి కల్యాణోత్సవాన్ని ఆరు బయట.. ప్రత్యేక కల్యాణ మండపంలో వేలాది మంది భక్తులు నడుమ వైభవంగా నిర్వహించేవారు. గడచిన రెండేళ్లుగా కరోనా కారణంగా ఏకాంతంగానే ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది భక్తులకు దూరంగా కొవిడ్ నిబంధనల మధ్య.. స్వామివారి కల్యాణాన్ని జరిపించారు.
ప్రభుత్వం తరఫున సింహాచలం దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలను, తలంబ్రాలను స్వామి వారికి అందజేశారు. మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థానానికి 15 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఇతర ప్రముఖులు స్వామి వారిని దర్శించుకున్నారు.
ఇదీ చూడండి: భద్రాద్రిలో కనుల పండువగా సీతారాముల కల్యాణం