ఆ ముఠా సింగరేణి సంస్థలో ఒక ఉద్యోగం విలువ రూ. 20 లక్షలుగా నిర్దారించింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను ప్రలోభపెడుతోంది. ఇది గమనించిన సింగరేణి విజిలెన్స్, సెక్యూరిటీ విభాగం చాకచక్యంగా వ్యవహరించాయి. సింగరేణి విజిలెన్స్ శాఖ ఇచ్చిన ఫిర్యాదుతో నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దర్నీ అరెస్టు చేశారు. సింగరేణి సంస్థ మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగ నియామకాల కోసం మార్చి 1వ తేదీన రాత పరీక్షల నిర్వహించనుంది. ఈ పరీక్ష పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో జరుగుతుంది. మొత్తం 68 పోస్టులకు సుమారు 20 వేల మంది అభ్యర్థులు రాత పరీక్షలో పోటీ పడుతున్నారు. ఇంటర్వ్యూ ప్రక్రియ లేదు. కేవలం రాత పరీక్ష ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఆ ముఠా దీన్ని అదనుగా భావించింది.
హైదరాబాద్కు చెందిన అశోక్ రెడ్డి, ఐత సాయి కలిసి కొందరు అమాయకులకు మాయమాటలు చెప్పి మోసగించాలని భావించారు. అజీజియా హోటల్ వద్ద ఓ అభ్యర్థిని మాటలతో మభ్య పెడుతున్నారు. అప్పుడే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
అక్రమంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో రాత పరీక్షకు ముందు కొందరు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారని... ఇలాంటి వారిని నమ్మద్దని సింగరేణి డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ తెలిపారు.
ఇదీ చదవండి: వివాహ వేడుక... అమరావతి నినాదానికి వేదిక