రాష్ట్రంలో విజృంబిస్తున్న విషజ్వరాలపై వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగానూ స్వైన్ఫ్లూ వ్యాధిగ్రస్థులు గణనీయంగా పెరుగుతున్నారు. ఇప్పటి వరకు దేశం మొత్తమ్మీద 28,451 కేసులు నమోదవగా.. 1213 మంది మృతిచెందారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో తక్కువగానే నమోదవుతున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఇప్పటికే(ఈ నెల 1 నాటికి) 1346 స్వైన్ఫ్లూ కేసులు నమోదుకావడం, 22 మంది ఈ మహమ్మారి బారినపడి మృతిచెందారు.
హెచ్1ఎన్1 వైరస్ విజృంభన
సాధారణంగా ఏటా నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు స్వైన్ఫ్లూ కేసులు అధికంగా నమోదవుతున్నట్లు వైద్యాధికారులు గుర్తించడంతో.. రానున్న రోజుల్లో హెచ్1ఎన్1 వైరస్ విజృంభించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, బాధితులకు అవసరమైన చికిత్సను సమర్థంగా అందించడంపై ఆరోగ్యశాఖ దృష్టిపెట్టింది.
సత్వర చికిత్స అవసరం
- ఐపీఎంలో రెండు ప్రయోగశాలలను, ఫీవర్, గాంధీ ఆసుపత్రుల్లో ఒక్కో ప్రయోగశాల చొప్పున అందుబాటులోకి తీసుకొచ్చారు.
- ప్రస్తుతం సగటున రోజుకు 70 వరకు నమూనాలను పరీక్షిస్తుండగా.. ఒకవేళ మున్ముందు పరిస్థితి తీవ్రరూపం దాల్చితే గరిష్ఠంగా రోజుకు 600 వరకు కూడా పరీక్షలు నిర్వహిస్తారు.
- గాంధీలో అత్యధికంగా 60 పడకలను, ఉస్మానియా(30), ఫీవర్ (30), నిలోఫర్(30) ఆసుపత్రులు సహా అన్ని జిల్లా దవాఖానాల్లోనూ కనీసం 10 పడకలతో స్వైన్ఫ్లూ చికిత్స కోసం ప్రత్యేక వార్డులు.
- స్వైన్ఫ్లూ బాధితులకు అత్యవసర చికిత్స కోసం రూ.కోటి వ్యయంతో ఉస్మానియా, నిలోఫర్ ఆసుపత్రుల్లో ఒక్కో దాంట్లో అయిదు చొప్పున, గాంధీ ఆసుపత్రిలో 7 ప్రాణవాయువు పరికరాలు, ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రిలోనూ కొత్తగా 8 వెంటిలేటర్లతో అత్యాధునిక ఐసీయూ.
- ఒక నెలలో గరిష్ఠంగా 5వేల పరీక్షలైనా చేయడానికి వీలుగా రూ.8.5 లక్షల వ్యయంతో ఈ నెలకు సంబంధించిన నిర్ధారణ పరీక్షల కిట్ల కొనుగోలు.
- నమూనా స్వీకరించిన 24 గంటల్లోనే ఫలితాలు వెల్లడి.
- స్వైన్ఫ్లూ బాధితుడిని గుర్తించగానే సత్వర చికిత్సతో పాటు.. కుటుంబ సభ్యులకూ ముందస్తు చికిత్స.
- బాధితులకు ప్రత్యేక చికిత్స అందించడానికి దాదాపు లక్ష మాత్రలు, 3,540 సిరప్లు, 13,750 టీకాలు, 11,570 ముఖానికి ధరించే మాస్కులు, చేతులు శుభ్రపర్చుకునేందుకు 5,810 ద్రావణాలు, స్వైన్ఫ్లూ వార్డుల్లోకి వెళ్లేందుకు ప్రత్యేకంగా ధరించేందుకు 4,275 కిట్ల సరఫరా.