నగరంలో మనోవైకల్యం కేసులు పెరుగుతున్నాయి. మానసిక ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు తదితర సమస్యలతో వస్తున్న ప్రతి 10 మందిలో నలుగురిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చికిత్సకు వస్తున్న వారిలో ఉద్యోగులు, ఉన్నత చదువులు చదివిన వారూ ఉంటున్నారని పేర్కొంటున్నారు.
కారణాలు:
లేని భయాలను ఊహించుకోవడం స్కిజోఫ్రీనియాకు ప్రధాన కారణమని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు. మారుతున్న జీవనశైలి, వృత్తి, వ్యక్తిగతమైన ఒత్తిడి, ఆందోళన, కుటుంబ సభ్యులు దూరం, కళ్లముందే జరిగే ఘటనలు, ఆ తరహా సాహిత్యం చదవడం, సినిమాలు చూడటం... తదితర కారణాలు దీనికి దోహదం చేస్తాయి. 50 శాతం మంది రోగుల్లో కుటుంబ చరిత్ర ప్రధానమని వైద్యులు పేర్కొంటున్నారు.
![Rising schizophrenia cases in the hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10447373_ps.jpg)
ఇవీ లక్షణాలు...
- భయం, భ్రాంతి, అనుమానంతో ఈ సమస్య మొదలవుతుంది.
- మొగ్గలోనే ఇలాంటి అనుమానాలు తుంచేయాలి.
- మానసిక ఒత్తిడి, భయం, ఆందోళనతో చివరికి స్కిజోఫ్రీనియాలోకి జారుకుంటారు.
- సర్దిచెప్పడానికి ప్రయత్నించినా కొట్టడానికి వెనుకాడరు.
- తమను తాము హింసించుకొంటారు. తీవ్రంగా భయపడుతుంటారు.
- అర్ధరాత్రి కిటికీలోంచి బయటకు చూస్తుంటారు. బయటకు వచ్చేందుకు ఇష్టపడరు.
- ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ఇష్టపడరు.
సరైన చికిత్సలతో నయం:
"స్కిజోఫ్రీనియాతో వచ్చే భ్రాంతి(డెలూసన్స్) చాలా ప్రమాదకరమైన మానసిక సమస్య. దీంతో బాధపడేవారికి స్నేహితులు, కుటుంబ సభ్యులు భరోసాగా నిలవాలి. కౌన్సెలింగ్తో నయం కాదు. తొలుత మందులు అందించి తర్వాత కౌన్సెలింగ్ చేయాలి. కచ్చితమైన చికిత్స అందితే 3 నెలలకు తిరిగి సాధారణ స్థితికి వస్తారు. పిల్లల వద్ద దెయ్యాలు, బ్లాక్ మ్యాజిక్స్ వంటి వాటి గురించి తరచూ మాట్లాడొద్దు."
-డాక్టర్ కృష్ణ సాహితి, సైక్రియాట్రిస్టు, అసిస్టెంట్ ప్రొఫెసర్, అపోలో వైద్య కళాశాల
ఇదీ చూడండి: సబ్సిడీ రుణాల దరఖాస్తు తేదీ పెంపు: మంత్రి కొప్పుల