Assets Registration Update Process: ఆస్తుల నమోదు అప్డేట్ ప్రక్రియలో అలసత్వం తగదని ఇంజనీర్లు, అధికారులకు నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ సూచించారు. శాఖకు సంబంధించిన భూములు, భవనాలు సహా ఇతరత్రా ఆస్తుల ఇన్వెంట్రీపై ఆయన సమీక్షించారు. సేకరించిన ఆస్తులన్నీ వెనువెంటనే శాఖకు బదలాయింపు జరగాలని ఆదేశాలు జారీ చేశారు.
ఎప్పటికప్పుడు రికార్డులు, ఆన్లైన్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆధికారులు, ఇంజినీర్లకు స్పష్టం చేశారు. ఆస్తులకు సంబంధించిన వివరాలన్నీ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఈ కసరత్తులో కొందరు తగిన రీతిలో స్పందించకపోవడంపై రజత్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆశించిన మేర పురోగతి లేదని అన్నారు.
సమయాభావం, సాధ్యాసాధ్యాలను కొందరు కారణాలుగా చెప్పినట్లు సమాచారం. సాధ్యం కాకపోతే తామే చేసుకుంటామని ఓ దశలో రజత్ కుమార్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. వీలైనంతర త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని, ఎక్కడా అలసత్వం తగదని ఆయన పేర్కొన్నారు. నిత్యం ఈ కసరత్తు జరుగుతూనే ఉండాలని తెలిపారు.