అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినా, చమురు సంస్థలు విచ్చలవిడిగా పెట్రోల్, డిజిల్ ధరలు పెంచుతున్నాయనీ, ఈ నెలలోనే 16 సార్లు ధరలు పెంచాయనీ రాష్ట్రంలోని వామపక్ష పార్టీలు విమర్శించాయి. ధరల పెంపును నిరసిస్తూ, ఈ నెల 25న ఉదయం 11 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చాయి. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ చాడ వెంకటరెడ్డి(సీపీఐ), తమ్మినేని వీరభద్రం(సీపీఎం), పోటు రంగారావు(సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ), తాండ్ర కుమార్(ఎంసీపీఐ), జానకీరాములు(ఆర్ఎస్పీ), బండ నరేందర్రెడ్డి(ఫార్వర్డ్ బ్లాక్), రాజేశ్(సీపీఐ ఎంఎల్ లిబరేషన్) తదితరులు మంగళవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు: నారాయణ
భారత, చైనా సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భాజపా, ఇతర రాజకీయ పార్టీలు చైనా వస్తువులను బహిష్కరించాలని చెప్పడం వేరనీ, కానీ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రులే వాటిని బహిష్కరించాలనడంలో అర్థం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్రెడ్డి ఇలాంటి ప్రకటనలు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే బదులు కేంద్ర ప్రభుత్వమే ఈ విషయంలో తీర్మానం చేయించేలా ఒప్పించాలని మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.