కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించడమే మార్గమని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య సిబ్బంది, ఇతర రంగాల సిబ్బందికి 2020 సంవత్సరంలో కొవిడ్-19 నివారణకు విధులు నిర్వర్తించామని భావి తరాలకు గర్వంగా చెప్పే అవకాశం వచ్చిందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉండాల్సిన సమయం ఇది అని ఆయన గుర్తు చేశారు.
లాక్డౌన్ సమయంలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు ఆయన సేఫ్టీ కిట్, స్టీల్ వాటర్ బాటిల్, బ్యాగు అందజేశారు. నగరంలోని నార్త్జోన్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా ఉందని, ఆ ప్రాంతంలో లాక్డౌన్ కఠినంగా అమలు చేయడం వల్లే ఈ ఫలితం వచ్చిందని ఆయన అన్నారు. ప్రజలు సహకరిస్తే.. హైదరాబాద్ను అతి తక్కువ రోజుల్లోనే రెడ్ జోన్ నుంచి గ్రీన్జోన్లోకి తీసుకురావచ్చని సీపీ అన్నారు.
ఇదీ చదవండి: శానిటైజర్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం