ఆన్లైన్ పాఠాలు బోధించేందుకు సర్వం సిద్ధమైంది. పాఠశాలల్లో రెండు నుంచి పదో తరగతి వరకు నేటి నుంచి టీవీ పాఠాలు మొదలు కానున్నాయి. దూరదర్శన్, టీ-శాట్ ద్వారా పాఠాలు ప్రసారం కానున్నాయి. పాఠశాల విద్యార్థులకు వారంలో ఐదు రోజులు టీవీలో పాఠాలు బోధించి... శని, ఆదివారాలు సెలవులు ఇస్తారు. ఐదో తరగతి వరకు రెండు, 6 నుంచి 8 వరకు రోజుకు మూడు... 9, 10 తరగతులకు రోజుకు నాలుగు తరగతులు ఉంటాయి. దీనికి తల్లిదండ్రులు సహకరించాలని విద్యాశాఖ కోరింది.
పాఠం పూర్తయిన తర్వాత టీవీలో వర్క్ షీట్ను చూపిస్తారు. విద్యార్థులు వర్క్ షీట్ పూర్తి చేసి.. ఉపాధ్యాయులకు వాట్సప్ ద్వారా పంపించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. టీవీలు లేని విద్యార్థులకు పాఠశాలలు లేదా పంచాయతీ కార్యాలయం లేదా తోటి విద్యార్థి ఇళ్లల్లో పాఠాలు వినేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగు మాధ్యమం విద్యార్థులకు మాత్రమే టీవీలో పాఠాలు బోధించనున్నారు. ఆంగ్లం, ఉర్దూ మాధ్యమం విద్యార్థులు ప్రస్తుతం దూరంగానే ఉండనున్నారు. టీవీలో ప్రసారమైన పాఠాలు... దూరదర్శన్ యూట్యూబ్ ఛానెల్, ఎస్సీఈఆర్టీ వెబ్సైట్లో తర్వాత కూడా అందుబాటులో ఉంటాయని విద్యాశాఖ పేర్కొంది.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులకు కూడా నేటి నుంచి దూరదర్శన్ ద్వారా పాఠాలు మొదలుకానున్నాయి. ఉదయం 10 నుంచి 12 వరకు... మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు దూరదర్శన్లో ఇంటర్మీడియట్ పాఠాలు ప్రసారం చేసేలా ఏర్పాట్లు చేసినట్లు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. ఇంటర్ వెబ్సైట్, యూట్యూబ్లో పాఠాలు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నేటి నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభంకానున్నాయి. జూమ్ వంటి యాప్ల ద్వారా ఇంటరాక్టివ్ పద్ధతిలో తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు వారం రోజులుగా ప్రయోగాత్మకంగా ఆన్లైన్ తరగతులు ప్రారంభించిన జేఎన్టీయూహెచ్... నేటి నుంచి పూర్తిస్థాయిలో అధికారికంగా విద్యా సంవత్సరం ప్రారంభించనుంది.
గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో పలు సవాళ్లు కనిపిస్తున్నప్పటికీ... డిజిటల్ బోధనకు విద్యాశాఖ తొలి అడుగు వేసింది. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు సహకరించాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు విద్యార్థులను ఆన్ లైన్ తరగతులకు సిద్ధం చేయడంతో పాటు... అనుమానాలు నివృత్తి చేయాలని కోరారు.
ఇదీ చూడండి: ముఖర్జీ మరణంపై ఆరెస్సెస్, భాజపా విచారం