భూ వివాదాలతో రెవెన్యూ కోర్టులను ఆశ్రయిస్తున్న వారికి అవరోధాలు తప్పడం లేదు. తహసీల్దారు కోర్టులకు వెళ్తున్న వారికి.. అక్కడ పరిష్కారం లభించక ఆర్డీవో కోర్టు తలుపు తడుతున్న వారికీ నిరాశే ఎదురవుతోంది. కేసుల పరిష్కారానికి సంబంధించిన వాదప్రతివాదాలు నిర్వహించడానికి ‘కరోనా ప్రభావం’ అడ్డంకిగా మారుతోంది. రెవెన్యూ అధికారులు సాధారణ కేసుల వాయిదాలను పొడిగిస్తూ వస్తున్నారు. సాధారణంగా మండల స్థాయిలో తహసీల్దారు, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీవో, జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కోర్టుల్లో భూ వివాదాల పరిష్కారం జరుగుతుంది. మార్చి నెలాఖరు నుంచి కొవిడ్-19 కారణంగా ఈ కోర్టుల కార్యకలాపాలు నెమ్మదించాయి. ప్రభుత్వం, హైకోర్టు, లోకాయుక్తలకు సంబంధించిన కేసులపై మాత్రమే దృష్టిసారిస్తున్నారు.
భూముల నిర్వహణపైనా ప్రభావం
భూ వివాదాలకు సంబంధించి రెవెన్యూ కోర్టుల్లో నమోదైన కేసులు ఆది నుంచీ ఓ పట్టాన తేలకుండా వస్తున్నాయని నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. తగినంత సిబ్బంది లేకపోవడం, పాత దస్త్రాలు అందుబాటులో లేకపోవడం తదితర సమస్యలతో కేసుల పరిష్కార పక్రియ సాగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే మూడేళ్ల క్రితం భూ వివాదాలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం (ఎల్ఆర్యూపీ) చేపట్టింది. దస్త్రాలను నవీకరించి సమాచారాన్ని ఉన్నతీకరిస్తోంది. ప్రతిరైతు ఖాతాకు ఆధార్ సంఖ్యను జత చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఇది చివరి దశకు చేరుకోగా కరోనా ప్రభావం.. యంత్రాంగం కార్యకలాపాలను స్తంభింపజేసింది. రద్దీ లేకుండా చూసే క్రమంలో ఈ పరిస్థితి తలెత్తుతోంది.
ఐదుకే పరిమితం
సాధారణంగా ఆర్డీవో కోర్టు నిర్వహించిన రోజు కనీసం 20 కేసులపై వాదప్రతివాదాలు జరగాల్సిఉన్నా.. ఇప్పుడు కేవలం ఐదుకే పరిమితం చేస్తున్నారు. ప్రధానమైన వాటికి మాత్రమే స్థానం కల్పిస్తున్నారు. మరోవైపు సివిల్కోర్టుల నిర్వహణ కూడా ఈ నెలాఖరుకు వాయిదా పడింది. కోర్టుల్లో వివాదాలు తేలి భూ యాజమాన్య హక్కులు లభిస్తాయని ఆశలు పెట్టుకున్న వారికి ప్రస్తుత పరిణామాలు మింగుడుపడటం లేదు.
రాష్ట్రంలో రెవెన్యూ కోర్టుల కేసుల్లో ఉన్న భూ విస్తీర్ణం
పీఓటీ కేసులు : 2.40 లక్షల ఎకరాలు
రెవెన్యూ కోర్టు వివాదాలు : 40 వేల ఎకరాలు
ఎల్టీఆర్ కేసులు : 95 వేల ఎకరాలు
సివిల్ కోర్టుల్లో ఉన్న కేసులకు సంబంధించిన భూమి : లక్ష ఎకరాలు
ఇదీ చదవండి: కరోనా టెస్టులు, చికిత్సల ధరలను ప్రకటించిన ప్రభుత్వం