రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం నేటి నుంచి అమల్లోకి రానుంది. భూమి హక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల చట్టం-2020 అమలు తేదీని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 29 నుంచి కొత్త చట్టం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
భూ సంబంధిత లావాదేవీలు పూర్తి పారదర్శకంగా జరిగేలా... ధరణి పోర్టల్ ద్వారా కోర్ బ్యాంకింగ్ విధానం తరహాలో జరగనున్నాయి. ఇందుకోసం ధరణి పోర్టల్ను పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. ఇప్పటికే అధికారులు, సిబ్బందికి వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చి సన్నద్ధం చేశారు. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులకు పోర్టల్లో వేర్వేరుగా చోటు కల్పించారు.
కొత్త రిజిస్ట్రేషన్లు, వారసత్వ బదిలీలు, తదితర లావాదేవీలన్నీ ఇక నుంచి ధరణి ద్వారానే జరగనున్నాయి. పోర్టల్లో భూములు, ఆస్తుల సమాచారం, నిషేధిత జాబితాలోని భూములు, ఎన్ కంబరెన్స్ సహా స్టాంపు డ్యూటీ నిర్ధరణ కోసం భూముల వారీగా మార్కెట్ విలువను పొందుపరిచారు. రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు పోర్టల్ ద్వారానే స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి: అధిక వ్యవసాయ రుణాలు మాఫీ చేసిన రాష్ట్రం తెలంగాణ: కేటీఆర్