ఆంధ్రప్రదేశ్లో విశాఖ నగరానికి ఆనుకుని భీమిలి నియోజకవర్గం కాపులుప్పాడ గ్రేహౌండ్స్ కొండపై 30 ఎకరాల్లో ఆ రాష్ట్ర అతిథిగృహం నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇప్పటికే భవనం డిజైన్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. నిర్మాణానికి భారీగా వ్యయం చేయనున్నారు. అతిథి గృహాన్ని పలు ప్యాకేజీల కింద చేపట్టేందుకు అవసరమైన నిధుల కేటాయింపు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రూ.30 కోట్ల విలువైన తొలి ప్యాకేజీ ప్రతిపాదనలను అహ్మదాబాద్కు చెందిన హెచ్సీపీ డిజైన్, ప్లానింగ్ సంస్థ విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్డీఏ)కు పంపినట్లు తెలుస్తోంది.
హెచ్సీపీ రూపొందిస్తున్న నమూనాలు, వివిధ దశల ప్యాకేజీల వ్యయ అంచనాల ప్రతిపాదనలను పరిశీలించేందుకు స్థానిక ఇంజినీరింగ్ అధికారులు ఒక కమిటీని ఏర్పాటు చేసుకొన్నట్లు సమాచారం. ఈ కమిటీ తొలి దశ పనులకు, నిధుల కేటాయింపునకు పచ్చజెండా ఊపిందని, టెండరు పిలిచేందుకు తుది దస్త్రం సైతం సిద్ధమైనట్లు తెలిసింది. ప్రస్తుతం వీఎంఆర్డీఏ అధికారులు కొండపై భూమి చదును చేయిస్తున్నారు. టెండర్లు పిలిచి పనులను ప్రారంభించే సమయానికి పొదలు, చెట్లు, గుట్టలను తొలగించే లక్ష్యంతో ఉన్నారు. వాహనాల రాకపోకలకు వీలుగా రోడ్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు.