బడ్జెట్ నిధుల ఉత్తర్వులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అనుసరించనుంది. తప్పనిసరి పథకాలు, కార్యక్రమాల అవసరాల కోసం ఒకేమారు నిధులు విడుదల చేయనుంది. కీలకమైన బియ్యం రాయతీ, విద్యుత్ రాయతీ, ఆసరా పింఛన్లు, 310, 311 పద్దుల కింద జీతాలు తదితర అవసరాల కోసం ఆర్నెళ్లకు సరిపడా నిధుల విడుదలకు ఒకే మారు ఉత్తర్వులు జారీ చేయనుంది. గతంలో ప్రతి మూణ్నెళ్లకోమారు నిధులు విడుదల చేసేవారు. ఇక నుంచి ఆర్నెళ్ల కాలానికి ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుతం మిగిలిన ఆర్నెళ్ల కాలానికి ఒకేమారు శాఖలకు ఆర్థిక శాఖ నిధులు విడుదల చేయనుంది. వాటికి అనుగుణంగా ఆయా శాఖలు పరిపాలనా అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. అటు రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి మూణ్నెళ్లకోమారు నిధుల విడుదల ఉత్తర్వులు ఇస్తారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో 75 శాతం విడుదల చేస్తారు. ఇక కొత్త పథకాలు, రుణాలకు సంబంధించి ఆయా శాఖల నుంచి ప్రతిపాదనలు అందాకే నిధులు విడుదల చేస్తామని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ నిర్ణయం, బీఆర్వో నేపథ్యంలో ఆర్నెళ్ల కాలానికి ఆసరా పింఛన్ల చెల్లింపుల కోసం నిధులు మంజూరు చేశారు. రూ.4425 కోట్ల 40 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు ఇచ్చారు. వృద్ధాప్య, దివ్యాంగులు, వితంతువులు, బోధకాల వ్యాధిగ్రస్తులకు పింఛన్లు, బీడీకార్మికులు, ఒంటరి మహిళలకు భృతి కోసం నిధుల మంజూరు చేశారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చూడండి:చెన్నై విమానాశ్రయంలో జిన్పింగ్కు ఘనస్వాగతం