ఖండాంతరాల్లో ఉన్నా... భాషను సుసంపన్నం చేస్తూ భవిష్యత్ తరాలకు తెలుగును అందించే ప్రయత్నం ఎంతో గొప్ప విషయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అభినందించారు. బతుకమ్మ ఉత్సవాలు పురస్కరించుకుని ఆస్ట్రేలియా -న్యూజిలాండ్ సంయుక్త అంతర్జాల తెలుగు సాంస్కృతిక మహోత్సవ ఆన్లైన్ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ఆన్లైన్ వేదికగా మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ, మాజీ ఎంపీ మురళీమోహన్, కార్యక్రమ నిర్వాహకులు రాజా రమేశ్, వాణీ మోటమర్రి, సతీశ్, మధుబైర్రెడ్డి, కిషోర్ రెడ్డి, ప్రశాంత్, వాణీ ఏలేటి, సుమేశ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ దేశాల్లోని 11 తెలుగు అసోసియేషన్లు ఈ కార్యక్రమం నిర్వహిస్తుండడం విశేషం. తెలుగు భాష, సాంస్కృతిక జ్ఞానం మనకు నిజమైన సంపదలని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 7117 భాషలు గుర్తించబడగా... దురదృష్టవశాత్తు 573 భాషలు అంతరించిపోయాయన్నారు. విదేశాల్లో జీవనం సాగిస్తూ... మాతృభాషను భవిష్యత్ తరాలకు అందించాలన్న కృషి అభినందనీయమని తెలిపారు. గతంలో హైదరాబాద్లో ప్రపంచ తెలుగు మహాసభలు అత్యంత వైభవంగా నిర్వహించి భాష పట్ల ప్రభుత్వ సంకల్పాన్ని సీఎం కేసీఆర్ చాటారని గుర్తు చేశారు.
భాష, సంస్కృతిపై తల్లిదండ్రులు పిల్లలకు అభిమానం పెంచాలి... అదే తాను చేసే విజ్ఞప్తి అని... మాతృ భాషపై పట్టు ఉంటే ఇతర భాషల మీద పట్టు సాధించగలుగుతారన్నారు. భాషతో పాటు విలువలను పెంపొందించుకోవడం ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు.