జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు ఉచిత తాగునీటి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేడు ప్రారంభించనుంది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్... ఈ పథకాన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని రహమత్నగర్ డివిజన్ ఎస్సీఆర్ హిల్స్లో... లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఇటీవలే ప్రభుత్వం విడుదల చేసింది. జనవరిలో జారీచేసే డిసెంబర్ బిల్లు నుంచే పథకం అమల్లోకి రానుంది. మురికివాడలు, బస్తీలలో నల్లా కనెక్షన్లకు ఇకపై ఎలాంటి బిల్లు ఉండదన్న అధికారులు... ఆ ప్రాంతాల్లో నల్లాలకు మీటర్లు లేకున్నా... డాకెట్ ఆధారంగా బిల్లు వసూలు చేయనున్నట్టు స్పష్టం చేశారుయ
మీటర్ తప్పనిసరి..
గృహవినియోగానికి నెలకు 20 వేలలీటర్ల ఉచిత మంచినీటి కోసం... మీటర్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. మీటర్ రీడింగ్ ప్రకారం నెలలో 20 వేల లీటర్లు దాటితే ప్రస్తుతం చెల్లిస్తున్న టారీఫ్ ప్రకారం బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. అపార్టుమెంట్లలోని ఒక్కో ఫ్లాటుకు 20వేల లీటర్ల చొప్పున అన్నింటికీ మంచినీళ్లు అందిస్తారు. 10 ప్లాట్లు ఉన్న అపార్టుమెంట్కు నెలకు 2 లక్షల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేసి అంతకుమించితే పాతటారీఫ్ లెక్కన బిల్లు వసూలు చేయాలని నిర్ణయించారు. జలమండలికి గ్రేటర్లో 10.08 లక్షల నల్లా కనెక్షన్లలో 2.37 లక్షల నల్లాలకే మీటర్లు ఉన్నాయి. ఈ పథకంతో లబ్ధిదారులకు 19.92 కోట్లు ఆదా అయ్యే అవకాశం ఉంది. సుమారు 97 శాతం పేద, మధ్య తరగతి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం చెబుతోంది.
మార్చి 31 వరకు గడువు
డొమెస్టిక్ వినియోగదారులు, అపార్ట్మెంట్వాసులు సొంతఖర్చుతో జలమండలి సూచించిన ఏజెన్సీల ద్వారా వాటర్ మీటర్లు ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఏజెన్సీ వివరాలు జలమండలి వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ పథకానికి ఆధార్కార్డును లింక్ చేసుకోవాల్సి ఉంటుందన్న అధికారులు... వినియోగదారులందరికీ మార్చి 31 వరకు మీటర్లు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆ సమయంలోపు మీటర్ల ఏర్పాటు, ఆధార్ కార్డు లింక్ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారందరికీ ఏప్రిల్ 1 నుంచి... డిసెంబర్ నుంచే ఆ పథకం వర్తించే విధంగా బిల్లులు జారీ చేయనున్నారు.
సందేహాలుంటే..
ఈ పథకం ద్వారా బస్తీలు, మురికి వాడల్లో లబ్దిపొందే వారి కనెక్షన్లు 1.96 లక్షలు, లబ్దిదారులు నెలకు ఆదాయం అయ్యే వ్యయం రూ. 4.78 కోట్లు, డొమెస్టిక్ వినియోగదారులు 7.87 లక్షలు, ఇందులో మీటర్లు అవసరం ఉన్న వారు 2.20 లక్షలు ... లబ్దిదారులకు రూ. 6.91 కోట్ల ఆదా, డొమెస్టిక్ అపార్ట్ మెంట్లు, డొమెస్టిక్ బల్క్ వారు 24 వేల 967, మీటరు కనెక్షన్లు ఉన్నవి 17, 192, లబ్ధిదారులకు రూ. 8.23 కోట్లు ఆదా కానుంది. వినియోగదారులు తమ క్యాన్ నెంబర్లతో ఆధార్ను లింక్ చేసుకోవడానికి www.hyderabadwater.gov.in వెబ్సైట్ ద్వారాగానీ... మీసేవలో గానీ ఆధార్ కార్డు క్యాన్ నెంబర్కు లింక్ చేసుకోవచ్చు. వినియోగదారులు తమ సందేహాలను కన్స్యూమర్ రిలేషన్ షిప్ మేనేజ్మెంట్ లేదా కష్టమర్ కేర్ నెంబర్ 155313, 040-2343 3933 కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
ఇదీ చూడండి: అన్ని శాఖల్లోని ఉద్యోగులకు పదోన్నతులు: సీఎం కేసీఆర్