కరోనా విపత్కర సమయంలో ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్- మెయిల్ సంస్థ... తన ఉదారతను చాటుకునేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆసుపత్రులకు వైద్య ఆక్సిజన్ను ఉచితంగా సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని మెయిల్ సంస్థ ప్రకటించింది. వివిధ ఆసుపత్రులలో ఉన్న రోగుల అవసరాలను తీర్చడానికి 35 లక్షల లీటర్ల వైద్య ఆక్సిజన్ను ఉత్పత్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలను కంపెనీ చేపడుతోందని మెఘా వెల్లడించింది.
ఆస్పత్రులు, ప్రభుత్వ అధికారులు, డీఆర్డీఓ అధికారులతో దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. ఒక్కో సిలిండర్ 7,000 లీటర్లు చొప్పున రోజుకు 500 సిలిండర్లను సరఫరా చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. రోజుకు 35 లక్షల లీటర్ల ఆక్సిజన్ మేఘా సంస్థ ఆసుపత్రులకు సరఫరా చేస్తుంది. అదేవిధంగా స్థానికంగా ఎంఈఐ.ఎల్ పరిశ్రమలో 10నుంచి 15 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులు తయారు చేస్తుందని సంస్థ తెలిపింది. స్పెయిన్ నుంచి రెండు నుంచి మూడు క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులు దిగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.