ETV Bharat / city

ముందు జాగ్రత్తగా మందులు.. దండిగా ఖర్చులు..

author img

By

Published : Nov 10, 2020, 6:35 AM IST

కరోనా దెబ్బకు ఔషధాలు నిత్యావసరాలుగా మారాయి. ప్రతి ఒక్కరూ విరివిగా మందులు వాడారు. మహమ్మారి బారి నుంచి రక్షించుకోవడానికి ప్రజలు స్తోమతకు మించి ఖర్చు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకూ 5 నెలల్లో కొవిడ్‌ సంబంధిత ఔషధాలు.. వైద్య పరికరాల కోసం దాదాపు రూ.9 వేల కోట్లకు పైగా వ్యయం చేసినట్లు తెలుస్తోంది

medicine purchase increased in
తెలంగాణలో పెరిగిన ఔషధాల విక్రయం

వరంగల్‌కు చెందిన ఓవ్యాపారి కుటుంబంలో ఐదుగురు జులైలో కరోనా బారినపడ్డారు. ఆ వ్యాపారితో పాటు ఆయన తల్లిదండ్రులు మధుమేహం, అధిక రక్తపోటుకు మందులు వాడుతున్నారు. అందరూ ఇంట్లోనే కొవిడ్‌ చికిత్స పొందారు. 4 వారాల పాటు ఔషధాలు వాడారు. ఇందులో ముగ్గురికి ఫావిపిరావిర్‌ మాత్రలను వినియోగించారు. వీటికి ప్రత్యేకంగా రూ.25 వేలు కాగా, మొత్తంగా ఐదుగురికి రూ.45 వేలకు పైగా ఖర్చయింది. ఇవి కాకుండా 2 పల్స్‌ ఆక్సిమీటర్లకు రూ.6 వేలు వెచ్చించారు. ఇప్పటికీ విటమిన్‌ మాత్రలు వాడుతూనే ఉన్నారు.

హైదరాబాద్‌లో ముగ్గురు సభ్యులున్న కుటుంబంలో 5 నెలలుగా విటమిన్‌ సి, మల్టీవిటమిన్‌, జింకు, విటమిన్‌ డి.. మాత్రలు వాడుతున్నారు. ఇప్పటివరకూ ఆ కుటుంబంలో ఎవరూ కొవిడ్‌ బారిన పడలేదు. కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు వైద్యుల సూచనల మేరకు విటమిన్‌ మాత్రలను వాడుతున్నారు. కేవలం వీటికోసం నెలకు రూ.1500కు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంకా ఇంట్లో పల్స్‌ ఆక్సిమీటర్‌, థర్మామీటర్‌, వేపరైజర్‌ పరికరాలు కొన్నారు. మాస్కులు, శానిటైజర్లకు ఎంత ఖర్చు చేశారో లెక్కేలేదు.

కరోనా దెబ్బకు ఔషధాలు నిత్యావసరాలుగా మారాయి. ప్రతి ఒక్కరూ విరివిగా మందులు వాడారు. మహమ్మారి బారి నుంచి రక్షించుకోవడానికి ప్రజలు స్తోమతకు మించి ఖర్చు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకూ 5 నెలల్లో కొవిడ్‌ సంబంధిత ఔషధాలు.. వైద్య పరికరాల కోసం దాదాపు రూ.9 వేల కోట్లకు పైగా వ్యయం చేసినట్లు తెలుస్తోంది.

ఇందులో విటమిన్‌ మాత్రలు, యాంటీ బయాటిక్స్‌ తదితరాల కోసమే సుమారు రూ.3 వేల కోట్లు వెచ్చించగా.. పల్స్‌ ఆక్సిమీటర్ల కోసం రూ.3 వేల కోట్లకు పైగా ఖర్చు చేయడం గమనార్హం. జీహెచ్‌ఎంసీ సహా జిల్లా కేంద్రాలు, ఇతర పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతి నుంచి ఉన్నతవర్గాల వరకూ.. ఒక్కో కుటుంబం 5 నెలల్లో దాదాపు రూ.15 వేల నుంచి 20 వేల వరకూ ఆర్థిక భారాన్ని మోసినట్లు తెలుస్తోంది.

విపరీతంగా పెరిగిన విక్రయాలు

రాష్ట్రంలో మార్చి 2న తొలి కొవిడ్‌ కేసు నమోదైంది. ఏప్రిల్‌, మే, జూన్‌, జులై, ఆగస్టు నెలల్లో వైరస్‌ విజృంభించింది. ఈ సమయంలో ప్రజలు స్వీయ జాగ్రత్తలపై దృష్టి పెట్టారు. కరోనా వచ్చినా, రాకున్నా.. ఇంటిల్లిపాదీ విటమిన్‌ మాత్రలను వాడారు. ముందు జాగ్రత్తగా పల్స్‌ ఆక్సిమీటర్లను, థర్మామీటర్లను కొన్నవారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. దీంతో కొవిడ్‌ సంబంధ ఔషధాలు, వస్తువుల విక్రయాలు 10 నుంచి 15 రెట్లు పెరిగాయి. ఇదే అదనుగా కొన్ని నాసిరకం మందులు, ఆక్సిమీటర్లు, వేపరైజర్లు విపణిలోకి వచ్చాయి. వీటిపై ఔషధ నియంత్రణాధికారుల పర్యవేక్షణ లోపించిందనే విమర్శలున్నాయి.

విటమిన్‌ గోలీలు

ఒక సాధారణ మందుల షాపులో.. విటమిన్‌ సి, డి 3, జింక్‌, బీ కాంప్లెక్స్‌ మాత్రలు నెల మొత్తంలో సుమారు రూ.30-40 వేలు అమ్ముడయ్యేవి. ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు మధ్యలో ఏకంగా నెలకు రూ.3 లక్షలకు పైగా వీటి వ్యాపారం పెరిగింది. రాష్ట్రంలో సాధారణంగా విటమిన్‌ సి, డి మాత్రల అమ్మకాలు నెలకు రూ.20-30 కోట్లు ఉండగా.. కొవిడ్‌ కాలంలో రూ.70 నుంచి 80 కోట్ల రూపాయలకు పెరిగాయి. జింక్‌ మాత్రలు కరోనాకు ముందు నెలకు రూ.50-60 కోట్ల మేర విక్రయిస్తుండగా.. అ సమయంలో రూ.150 కోట్ల వరకూ వెళ్లిందని ఔషధ వ్యాపార వర్గాలు వెల్లడించాయి. ఒక దశలో కొన్ని ఔషధ ఉత్పత్తి సంస్థలు విటమిన్‌ మాత్రలు పూర్తిగా ఆరకముందే పంపించిన దాఖలాలు ఉన్నాయని ఓ ఔషధ దుకాణదారు తెలిపారు.

పారాసిటమాల్‌

ఈ మాత్రలు కరోనాకు ముందు నెలకు సుమారు రూ.70 కోట్లు విక్రయిస్తుండగా.. కొవిడ్‌ కాలంలో వీటి అమ్మకాలు రూ.100-120 కోట్లకు పెరిగాయి. ఇంకా అజిత్రోమైసిన్‌, డాక్సిసైక్లిన్‌ వంటి యాంటీబయాటిక్స్‌ అమ్మకాలు కూడా సాధారణంగా నెలకు రూ.100-150 కోట్లుండేవి. కొవిడ్‌ సమయంలో ఏకంగా రూ.400-500 కోట్ల అమ్మకాలు జరిగాయి.

పల్స్‌ ఆక్సిమీటర్లు

సాధారణంగా పల్స్‌ ఆక్సిమీటర్లు ఒక చిన్న ఔషధ దుకాణంలో నెలకు ఒకటో రెండో అమ్ముడవుతాయి. అదే హైదరాబాద్‌లోని పంజాగుట్టలోని ఓ పెద్ద ఫార్మసీలో నెలకు 30 నుంచి 50 వరకు విక్రయిస్తే ఎక్కువ. కొవిడ్‌ సమయంలో నెలకు 20 వేలకు పైగా పల్స్‌ ఆక్సిమీటర్లను ఒకే దుకాణంలో అమ్మారంటే ప్రజలు ఎంతలా కొనుగోలు చేశారో అర్థమవుతోంది. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే సుమారు 30 లక్షల పల్స్‌ ఆక్సిమీటర్లు ప్రజలు కొన్నట్లు ఔషధ వ్యాపార వర్గాలు తెలిపాయి. సాధారణ రోజుల్లో వీటి ధర రూ.500 వరకూ ఉండగా.. కరోనా సమయంలో రూ.3 వేల వరకూ పెరిగింది.

వేపరైజర్లు

శ్వాస తేలిగ్గా ఆడడం కోసం ఆవిరి పట్టడానికి ఉపయోగించే వేపరైజర్ల వ్యాపారం రూ.500 కోట్ల మేర జరిగినట్లు విశ్లేషణ. పంజాగుట్టలోని ఒక పెద్దషాపులో థర్మామీటర్లు నెలకు 3-4 కూడా అమ్మని పరిస్థితి ఇంతకుముందు ఉండేది. కరోనా తర్వాత అదే దుకాణంలో నెలకు 30-40 వేల మిషన్‌లు విక్రయించారంటే ఎన్ని అమ్ముడయ్యాయో అర్థం చేసుకోవచ్చు.

రెమిడిసివిర్‌

ఈ ఆరు ఇంజక్షన్ల కోర్సు కోసం కనీసం 40-50 వేల వరకూ ఖర్చుపెట్టారు.ఆసుపత్రిలో చేరిన ప్రతి రోగికీ రెమిడిసివిర్‌ ఇంజక్షన్‌ ఇచ్చారంటే.. ఎన్ని లక్షల్లో వినియోగించారో తెలుస్తోంది. కొందరు రోగులకు అతి ఖరీదైన టోసిలిజుమాబ్‌ ఇంజక్షన్లను కూడా వాడారు. వీటికోసం రూ.2 లక్షలు ఖర్చు పెట్టిన సందర్భాలూ ఉన్నాయి. ఇంకా ఫావిపిరవిర్‌ మాత్రలు లక్షల్లో అమ్ముడుపోయాయి. ఒక్కో రోగి 100 మాత్రలు వాడాల్సి వచ్చేది. వీటికోసం రూ.5-6 వేలు కూడా వెచ్చించి కొనుగోలు చేశారు.

ప్రభుత్వ వైద్యంలోనూ భారీగా వాడకం

రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్సల కోసం వినియోగించిన ఔషధాలు.. గత ఏడాదితో పోల్చితే రెట్టింపు కంటే అధికంగా వినియోగించినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఉదాహరణకు విటమిన్‌ సి మాత్రలు గతేడాది మొత్తమ్మీద 4.10 కోట్లు వినియోగించగా.. ఈ ఏడాదిలో గత 7 నెలల్లోనే 6.4 కోట్లు వాడారు. డాక్సిసైక్లిన్‌ మాత్రలు గతేడాది కేవలం 19.25 లక్షలు వాడగా.. ఈ ఏడాదిలో మార్చి-అక్టోబరు వరకూ 1.27 కోట్లు మాత్రలు చికిత్సకు ఉపయోగించారు. అజిత్రోమైసిన్‌ గోలీలు గడిచిన 7 నెలల్లోనే 2.5 కోట్లకు పైగా రోగులకు అందించారు. జింకు సల్ఫేట్‌ కూడా ఇప్పటికే 72.58 లక్షలు సరఫరా చేశారు. మున్ముందు మళ్లీ కొవిడ్‌ విజృంభించే అవకాశాలున్నాయనే హెచ్చరికలు ఉండటంతో.. కీలకమైన ఈ ఔషధాలను అందుబాటులో ఉంచుకోవడంపై వైద్యశాఖ దృష్టి పెట్టింది.

నాసిరకం ఔషధాలను నిలిపివేశాం

ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకూ ఔషధ అమ్మకాలు అనూహ్యంగా పెరిగినా.. గత రెండు నెలలుగా పడిపోయాయి. కాలానుగుణ వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందకపోవడంతో.. యాంటీబయాటిక్స్‌ అమ్మకాలు 60-70 శాతం తగ్గాయి. కొవిడ్‌ విజృంభణ సమయంలో విపణిలోకి కొన్ని నాసిరకమైన ఔషధాలను తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగాయి. మేం గుర్తించిన వాటిని వెంటనే నిలిపివేశాం. ఉదాహరణకు విటమిన్‌-సి మాత్ర 500 మిల్లీగ్రాములు రావాలి. కొన్ని సంస్థలు వీటిని 500 మైక్రోగ్రామ్స్‌తో తయారుచేశాయి. ఈ విషయాన్ని అందరికీ చెప్పి.. ఆ ఔషధాలను వెనక్కి పంపాం.

- అరుగొండ శ్రీధర్‌, అధ్యక్షుడు, ఔషధ దుకాణదారుల సంఘం, జీహెచ్‌ఎంసీ

సమతుల ఆహారం ముఖ్యం

కొవిడ్‌ కాలంలో తెలిసో తెలియకో ఎక్కువ మంది విటమిన్‌ మాత్రలు తీసుకున్నారు. దీనివల్ల మంచి జరిగింది. ఇవి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. కానీ మాత్రలపై ఆధారపడటం కంటే.. సహజసిద్ధంగా దొరికే పండ్లు, కూరగాయలను తినడం ద్వారా రోగ నిరోధకశక్తిని పెంచుకోవాలి. రోజూ కొంతసేపు ఎండలో నిలబడటం, పాలు, గుడ్లు వంటివి తీసుకోవడం, నడక, శారీరక వ్యాయామాన్ని చేయడం ద్వారా.. వెలుపలి నుంచి తీసుకునే ఔషధాల కంటే ఎక్కువ మేలు జరుగుతుంది.

- డాక్టర్‌ మనోహర్‌, విశ్రాంత ఆచార్యులు జనరల్‌ మెడిసిన్‌, ఉస్మానియా వైద్యకళాశాల

వరంగల్‌కు చెందిన ఓవ్యాపారి కుటుంబంలో ఐదుగురు జులైలో కరోనా బారినపడ్డారు. ఆ వ్యాపారితో పాటు ఆయన తల్లిదండ్రులు మధుమేహం, అధిక రక్తపోటుకు మందులు వాడుతున్నారు. అందరూ ఇంట్లోనే కొవిడ్‌ చికిత్స పొందారు. 4 వారాల పాటు ఔషధాలు వాడారు. ఇందులో ముగ్గురికి ఫావిపిరావిర్‌ మాత్రలను వినియోగించారు. వీటికి ప్రత్యేకంగా రూ.25 వేలు కాగా, మొత్తంగా ఐదుగురికి రూ.45 వేలకు పైగా ఖర్చయింది. ఇవి కాకుండా 2 పల్స్‌ ఆక్సిమీటర్లకు రూ.6 వేలు వెచ్చించారు. ఇప్పటికీ విటమిన్‌ మాత్రలు వాడుతూనే ఉన్నారు.

హైదరాబాద్‌లో ముగ్గురు సభ్యులున్న కుటుంబంలో 5 నెలలుగా విటమిన్‌ సి, మల్టీవిటమిన్‌, జింకు, విటమిన్‌ డి.. మాత్రలు వాడుతున్నారు. ఇప్పటివరకూ ఆ కుటుంబంలో ఎవరూ కొవిడ్‌ బారిన పడలేదు. కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు వైద్యుల సూచనల మేరకు విటమిన్‌ మాత్రలను వాడుతున్నారు. కేవలం వీటికోసం నెలకు రూ.1500కు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంకా ఇంట్లో పల్స్‌ ఆక్సిమీటర్‌, థర్మామీటర్‌, వేపరైజర్‌ పరికరాలు కొన్నారు. మాస్కులు, శానిటైజర్లకు ఎంత ఖర్చు చేశారో లెక్కేలేదు.

కరోనా దెబ్బకు ఔషధాలు నిత్యావసరాలుగా మారాయి. ప్రతి ఒక్కరూ విరివిగా మందులు వాడారు. మహమ్మారి బారి నుంచి రక్షించుకోవడానికి ప్రజలు స్తోమతకు మించి ఖర్చు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకూ 5 నెలల్లో కొవిడ్‌ సంబంధిత ఔషధాలు.. వైద్య పరికరాల కోసం దాదాపు రూ.9 వేల కోట్లకు పైగా వ్యయం చేసినట్లు తెలుస్తోంది.

ఇందులో విటమిన్‌ మాత్రలు, యాంటీ బయాటిక్స్‌ తదితరాల కోసమే సుమారు రూ.3 వేల కోట్లు వెచ్చించగా.. పల్స్‌ ఆక్సిమీటర్ల కోసం రూ.3 వేల కోట్లకు పైగా ఖర్చు చేయడం గమనార్హం. జీహెచ్‌ఎంసీ సహా జిల్లా కేంద్రాలు, ఇతర పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతి నుంచి ఉన్నతవర్గాల వరకూ.. ఒక్కో కుటుంబం 5 నెలల్లో దాదాపు రూ.15 వేల నుంచి 20 వేల వరకూ ఆర్థిక భారాన్ని మోసినట్లు తెలుస్తోంది.

విపరీతంగా పెరిగిన విక్రయాలు

రాష్ట్రంలో మార్చి 2న తొలి కొవిడ్‌ కేసు నమోదైంది. ఏప్రిల్‌, మే, జూన్‌, జులై, ఆగస్టు నెలల్లో వైరస్‌ విజృంభించింది. ఈ సమయంలో ప్రజలు స్వీయ జాగ్రత్తలపై దృష్టి పెట్టారు. కరోనా వచ్చినా, రాకున్నా.. ఇంటిల్లిపాదీ విటమిన్‌ మాత్రలను వాడారు. ముందు జాగ్రత్తగా పల్స్‌ ఆక్సిమీటర్లను, థర్మామీటర్లను కొన్నవారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. దీంతో కొవిడ్‌ సంబంధ ఔషధాలు, వస్తువుల విక్రయాలు 10 నుంచి 15 రెట్లు పెరిగాయి. ఇదే అదనుగా కొన్ని నాసిరకం మందులు, ఆక్సిమీటర్లు, వేపరైజర్లు విపణిలోకి వచ్చాయి. వీటిపై ఔషధ నియంత్రణాధికారుల పర్యవేక్షణ లోపించిందనే విమర్శలున్నాయి.

విటమిన్‌ గోలీలు

ఒక సాధారణ మందుల షాపులో.. విటమిన్‌ సి, డి 3, జింక్‌, బీ కాంప్లెక్స్‌ మాత్రలు నెల మొత్తంలో సుమారు రూ.30-40 వేలు అమ్ముడయ్యేవి. ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు మధ్యలో ఏకంగా నెలకు రూ.3 లక్షలకు పైగా వీటి వ్యాపారం పెరిగింది. రాష్ట్రంలో సాధారణంగా విటమిన్‌ సి, డి మాత్రల అమ్మకాలు నెలకు రూ.20-30 కోట్లు ఉండగా.. కొవిడ్‌ కాలంలో రూ.70 నుంచి 80 కోట్ల రూపాయలకు పెరిగాయి. జింక్‌ మాత్రలు కరోనాకు ముందు నెలకు రూ.50-60 కోట్ల మేర విక్రయిస్తుండగా.. అ సమయంలో రూ.150 కోట్ల వరకూ వెళ్లిందని ఔషధ వ్యాపార వర్గాలు వెల్లడించాయి. ఒక దశలో కొన్ని ఔషధ ఉత్పత్తి సంస్థలు విటమిన్‌ మాత్రలు పూర్తిగా ఆరకముందే పంపించిన దాఖలాలు ఉన్నాయని ఓ ఔషధ దుకాణదారు తెలిపారు.

పారాసిటమాల్‌

ఈ మాత్రలు కరోనాకు ముందు నెలకు సుమారు రూ.70 కోట్లు విక్రయిస్తుండగా.. కొవిడ్‌ కాలంలో వీటి అమ్మకాలు రూ.100-120 కోట్లకు పెరిగాయి. ఇంకా అజిత్రోమైసిన్‌, డాక్సిసైక్లిన్‌ వంటి యాంటీబయాటిక్స్‌ అమ్మకాలు కూడా సాధారణంగా నెలకు రూ.100-150 కోట్లుండేవి. కొవిడ్‌ సమయంలో ఏకంగా రూ.400-500 కోట్ల అమ్మకాలు జరిగాయి.

పల్స్‌ ఆక్సిమీటర్లు

సాధారణంగా పల్స్‌ ఆక్సిమీటర్లు ఒక చిన్న ఔషధ దుకాణంలో నెలకు ఒకటో రెండో అమ్ముడవుతాయి. అదే హైదరాబాద్‌లోని పంజాగుట్టలోని ఓ పెద్ద ఫార్మసీలో నెలకు 30 నుంచి 50 వరకు విక్రయిస్తే ఎక్కువ. కొవిడ్‌ సమయంలో నెలకు 20 వేలకు పైగా పల్స్‌ ఆక్సిమీటర్లను ఒకే దుకాణంలో అమ్మారంటే ప్రజలు ఎంతలా కొనుగోలు చేశారో అర్థమవుతోంది. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే సుమారు 30 లక్షల పల్స్‌ ఆక్సిమీటర్లు ప్రజలు కొన్నట్లు ఔషధ వ్యాపార వర్గాలు తెలిపాయి. సాధారణ రోజుల్లో వీటి ధర రూ.500 వరకూ ఉండగా.. కరోనా సమయంలో రూ.3 వేల వరకూ పెరిగింది.

వేపరైజర్లు

శ్వాస తేలిగ్గా ఆడడం కోసం ఆవిరి పట్టడానికి ఉపయోగించే వేపరైజర్ల వ్యాపారం రూ.500 కోట్ల మేర జరిగినట్లు విశ్లేషణ. పంజాగుట్టలోని ఒక పెద్దషాపులో థర్మామీటర్లు నెలకు 3-4 కూడా అమ్మని పరిస్థితి ఇంతకుముందు ఉండేది. కరోనా తర్వాత అదే దుకాణంలో నెలకు 30-40 వేల మిషన్‌లు విక్రయించారంటే ఎన్ని అమ్ముడయ్యాయో అర్థం చేసుకోవచ్చు.

రెమిడిసివిర్‌

ఈ ఆరు ఇంజక్షన్ల కోర్సు కోసం కనీసం 40-50 వేల వరకూ ఖర్చుపెట్టారు.ఆసుపత్రిలో చేరిన ప్రతి రోగికీ రెమిడిసివిర్‌ ఇంజక్షన్‌ ఇచ్చారంటే.. ఎన్ని లక్షల్లో వినియోగించారో తెలుస్తోంది. కొందరు రోగులకు అతి ఖరీదైన టోసిలిజుమాబ్‌ ఇంజక్షన్లను కూడా వాడారు. వీటికోసం రూ.2 లక్షలు ఖర్చు పెట్టిన సందర్భాలూ ఉన్నాయి. ఇంకా ఫావిపిరవిర్‌ మాత్రలు లక్షల్లో అమ్ముడుపోయాయి. ఒక్కో రోగి 100 మాత్రలు వాడాల్సి వచ్చేది. వీటికోసం రూ.5-6 వేలు కూడా వెచ్చించి కొనుగోలు చేశారు.

ప్రభుత్వ వైద్యంలోనూ భారీగా వాడకం

రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్సల కోసం వినియోగించిన ఔషధాలు.. గత ఏడాదితో పోల్చితే రెట్టింపు కంటే అధికంగా వినియోగించినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఉదాహరణకు విటమిన్‌ సి మాత్రలు గతేడాది మొత్తమ్మీద 4.10 కోట్లు వినియోగించగా.. ఈ ఏడాదిలో గత 7 నెలల్లోనే 6.4 కోట్లు వాడారు. డాక్సిసైక్లిన్‌ మాత్రలు గతేడాది కేవలం 19.25 లక్షలు వాడగా.. ఈ ఏడాదిలో మార్చి-అక్టోబరు వరకూ 1.27 కోట్లు మాత్రలు చికిత్సకు ఉపయోగించారు. అజిత్రోమైసిన్‌ గోలీలు గడిచిన 7 నెలల్లోనే 2.5 కోట్లకు పైగా రోగులకు అందించారు. జింకు సల్ఫేట్‌ కూడా ఇప్పటికే 72.58 లక్షలు సరఫరా చేశారు. మున్ముందు మళ్లీ కొవిడ్‌ విజృంభించే అవకాశాలున్నాయనే హెచ్చరికలు ఉండటంతో.. కీలకమైన ఈ ఔషధాలను అందుబాటులో ఉంచుకోవడంపై వైద్యశాఖ దృష్టి పెట్టింది.

నాసిరకం ఔషధాలను నిలిపివేశాం

ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకూ ఔషధ అమ్మకాలు అనూహ్యంగా పెరిగినా.. గత రెండు నెలలుగా పడిపోయాయి. కాలానుగుణ వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందకపోవడంతో.. యాంటీబయాటిక్స్‌ అమ్మకాలు 60-70 శాతం తగ్గాయి. కొవిడ్‌ విజృంభణ సమయంలో విపణిలోకి కొన్ని నాసిరకమైన ఔషధాలను తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగాయి. మేం గుర్తించిన వాటిని వెంటనే నిలిపివేశాం. ఉదాహరణకు విటమిన్‌-సి మాత్ర 500 మిల్లీగ్రాములు రావాలి. కొన్ని సంస్థలు వీటిని 500 మైక్రోగ్రామ్స్‌తో తయారుచేశాయి. ఈ విషయాన్ని అందరికీ చెప్పి.. ఆ ఔషధాలను వెనక్కి పంపాం.

- అరుగొండ శ్రీధర్‌, అధ్యక్షుడు, ఔషధ దుకాణదారుల సంఘం, జీహెచ్‌ఎంసీ

సమతుల ఆహారం ముఖ్యం

కొవిడ్‌ కాలంలో తెలిసో తెలియకో ఎక్కువ మంది విటమిన్‌ మాత్రలు తీసుకున్నారు. దీనివల్ల మంచి జరిగింది. ఇవి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. కానీ మాత్రలపై ఆధారపడటం కంటే.. సహజసిద్ధంగా దొరికే పండ్లు, కూరగాయలను తినడం ద్వారా రోగ నిరోధకశక్తిని పెంచుకోవాలి. రోజూ కొంతసేపు ఎండలో నిలబడటం, పాలు, గుడ్లు వంటివి తీసుకోవడం, నడక, శారీరక వ్యాయామాన్ని చేయడం ద్వారా.. వెలుపలి నుంచి తీసుకునే ఔషధాల కంటే ఎక్కువ మేలు జరుగుతుంది.

- డాక్టర్‌ మనోహర్‌, విశ్రాంత ఆచార్యులు జనరల్‌ మెడిసిన్‌, ఉస్మానియా వైద్యకళాశాల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.