శాసనమండలి ప్రొటెం ఛైర్మన్గా మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి వ్యవహరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సిఫారసును ఆమోదించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్... భూపాల్ రెడ్డిని ప్రొటెం ఛైర్మన్గా నియమించారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రొటెం ఛైర్మన్ హోదాలో మండలి ఛైర్మన్ బాధ్యతలు నిర్వర్తించనున్న భూపాల్ రెడ్డికి సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించే అధికారాన్ని కూడా అప్పగించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 184(1) ప్రకారం నోటిఫికేషన్ కూడా జారీ చేశారు.
ప్రస్తుత మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్... ఎమ్మెల్సీ సభ్యత్వాల పదవీకాలం ఇవాళ్టితో ముగిసింది. దీంతో ప్రొటెం ఛైర్మన్ నియామకం అనివార్యమైంది. 2007లో ఉమ్మడి రాష్ట్రంలో శాసనమండలి పునరుద్ధరణ అయినప్పటి నుంచి భూపాల్రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన ప్రొటెం ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. గుత్తా, విద్యాసాగర్తో పాటు చీఫ్ విప్గా ఉన్న బోడకుంటి వెంకటేశ్వర్లు సహా కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలిత పదవీకాలం కూడా ఇవాళ్టితో పూర్తైంది. మండలిలో జరిగిన కార్యక్రమంలో వారికి వీడ్కోలు పలికారు. శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని వారిని సన్మానించారు.