పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు తోడు ఏళ్లుగా డైట్ ఛార్జీలు పెంచకపోవడంతో ఆస్పత్రుల్లో రోగులకు అందించే ఆహారంలో నాణ్యత కొరవడుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక్కో రోగికి ఉదయం అల్పాహారంతోపాటు రెండు పూటలా సాధారణ భోజనానికైతే రూ.40 చొప్పున, హైప్రొటీన్ డైట్కు రూ.56 చొప్పున ప్రభుత్వం గుత్తేదారుకు చెల్లిస్తోంది. వైద్యులకు ఉదయం అల్పాహారంతోపాటు రెండుపూటలా భోజనానికి రూ.80 చొప్పున ఇస్తోంది. 2011 కంటే ముందు రోగులకు రూ.20, వైద్యులకు రూ.40, హైప్రోటీన్ డైట్ ఛార్జీ రూ.28 ఉండేది. ప్రతి ఆసుపత్రిలో రోగుల మెనూను సక్రమంగా పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. ఉదయం అల్పాహారంలో ఇడ్లీ, వడ, మధ్యాహ్నం భోజనంలో పప్పు, కూర, సాంబారు, ఉడకబెట్టిన గుడ్డు, అరటి పండు పంపిణీ చేస్తున్నారు. ఇటీవల పెట్రో, వంటగ్యాస్ ధరలు పెరగడంతో కార్మికుల వేతనాలు ఇతర ఖర్చుల వల్ల గత్యంతరం లేని స్థితిలో ఆహార పంపిణీ నాణ్యత విషయంలో రాజీ పడాల్సి వస్తోందని గుత్తేదారులంటున్నారు.
నిలోఫర్లో కిచిడీనే..
నిలోఫర్లో రోగులకు కిచిడీ, సాంబారు, అన్నం, నీళ్లలాంటి మజ్జిగే దిక్కు. 1-16 సంవత్సరాల పిల్లలు, నిండు గర్భిణులకు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సుమారు వెయ్యిమంది రోగులకు రుచికరమైన ఆహారం అందించాలి. పురుడు పోసుకున్న తల్లులకు అధిక ప్రోటీన్ల భోజనం పంపిణీ చేయాలి. ఇక్కడి భోజనంలోనూ నాణ్యత లేదని రోగులు వాపోతున్నారు. ఇప్పటికే ఆహార పంపిణీకి సంబంధించి రూ.2.5 కోట్ల కుంభకోణం జరగగా విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అయినా పరిస్థితులు మారలేదు. అధిక ప్రోటీన్ ఆహారంలో గుడ్డు, ఏదైన ఒక పండు ఇవ్వాలి. ఎక్కువగా ఒక్క అరటిపండు మాత్రమే ఇస్తున్నట్లు చెబుతున్నారు. పిల్లలకు మాత్రం పాలు, బ్రెడ్ ఇస్తారు. రోగికి ఇచ్చే ఆహారంలోనే సహాయకులు కూడా సర్దుబాటు చేసుకొని తింటుంటారు. కొన్నిసార్లు ఆ ఆహారం సరిపోక దాతలు పెట్టే వాటి కోసం ఎదురు చూస్తుంటారు. ఒక్కో రోగికి భోజన ఛార్జీగా ప్రభుత్వం రూ.40 ఇస్తుంటే నిలోఫర్లో కాంట్రాక్టర్లు పోటీపడి రూ.36కే ఇస్తామని టెండర్లు వేయడం గమనార్హం.
రోగుల మెనూ..
* ఉదయం.. ఇడ్లీ లేదా ఉప్మా
* మధ్యాహ్నం.. భోజనంలో 600 గ్రాముల అన్నం, కూర పప్పు, సాంబారు, ఉడకబెట్టిన గుడ్డు, అరటి పండు
* రాత్రి.. 450 గ్రాముల అన్నం, కూర, పప్పు, సాంబారు, మజ్జిగ
వైద్యుల ఆహార పట్టిక
* ఉదయం.. అల్పాహారం
* మధ్యాహ్నం.. భోజనంలో కూర, పప్పు, సాంబారు, పెరుగు, చికెన్
* సాయంత్రం.. టీ, బస్కెట్లు
* రాత్రి.. ఒక కూర, గుడ్డు కూర, పప్పు, సాంబారు, పెరుగు
గాంధీలో శుభ్రత కరవు..
గాంధీ ఆసుపత్రిలో రోగులకిచ్చే ఆహారం కొంత మెరుగే. అయితే వంట చేసే చోట అపరిశుభ్రత తాండవిస్తోంది. సెల్లార్లో వంటగది ఉండటంతో వర్షాలు పడితే నిండిపోతుంది. రోగులకిచ్చే ఆహారంపై పలుమార్లు ఫిర్యాదులు రాగా ఆసుపత్రిని కరోనా నోడల్ కేంద్రంగా మార్చడంతో కొంత మార్పు వచ్చింది. ప్రస్తుతం ఆసుపత్రిలో 57 మంది కరోనా రోగులు, 700 మంది సాధారణ ఇన్పేషెంట్లున్నారు. మధ్యాహ్నం, రాత్రివేళ.. సన్నబియ్యంతో వండిన అన్నం, ఒక కూర, సాంబారు, గుడ్డు, అరటిపండు ఇస్తున్నారు. కరోనా రోగులకైతే రెండు కూరలతో అన్నం, సాంబారు, అవసరమైన పండ్లను అందిస్తున్నారు. కాఫీ, పాలు కూడా సరఫరా చేస్తున్నారు.
ఉస్మానియా.. నాణ్యత ఏదయా?
ఉస్మానియా ఆసుపత్రిలో ఇన్పేషెంట్లకు నాసిరకమైన ఆహారం పంపిణీ జరుగుతోంది. రోగులతోపాటు విధి నిర్వహణలో ఉండే వైద్యులకు ఆసుపత్రిలోని వంట గదిలో అల్పాహారం, భోజనం పంపిణీ చేస్తున్నారు. ఈ ధర్మాసుపత్రిలో గతంలో 1400 మంది ఇన్పేషెంట్లు ఉండేవారు. కరోనా నేపథ్యంలో గతేడాది 650-700 మంది ఇన్పేషెంట్లకు ఆహార పర్యవేక్షకులు (చీఫ్ డైటీషియన్) స్వీయ పర్యవేక్షణలో భోజనం పంపిణీ చేస్తున్నారు. వీరితోపాటు వైద్యుల సూచన మేరకు మూత్రపిండాల వ్యాధులు, హృద్రోగంతో బాధపడే రోగులకు హైప్రోటీన్ డైట్ ఇస్తున్నారు. రోడ్డుప్రమాదాల్లో గాయాలపాలై ఆహారం నమలలేని క్షతగాత్రులు, పాముకాటుకు గురైన రోగులకు ద్రవ పదార్థం రూపంలో ఇస్తున్నారు. పప్పు, కూరగాయలు పలుచగా రుచి లేకుండా.. నాణ్యత లేమితో ఉంటున్నాయని రోగులు, సహాయకులు ఆరోపిస్తున్నారు.
భోజనం తగినంత పెడుతున్నా.. కూరలు బాగానే ఉంటున్నా చప్పగా ఉంటున్నాయి. అడిగితే రోగులకిచ్చే ఆహారం ఇలాగే ఉండాలి.. వైద్యులు చెప్తేనే ఇస్తున్నామని సిబ్బంది అంటున్నారు.