గాంధీ ఆసుపత్రిలోని సీసీ కెమెరాల్లో 30-40 శాతం పనిచేయడంలేదు. కాపలాదారుల పర్యవేక్షణ అంతంతమాత్రంగా ఉండడం వల్ల నలుగురు ఖైదీలు తప్పించుకున్నారు. రెండేళ్ల కిందట ఇదే ఆసుపత్రి స్నానపుగది ఊచలు విరిచి మంచినీటి పైపు ఆధారంగా ఖైదీల వార్డు నుంచి పారిపోవడం సంచలనం రేపింది. తాజాగా అదే తరహా ఘటన చోటుచేసుకోవడం చూస్తే... గత అనుభవాలతో అధికారులు పాఠాలు నేర్వలేదని స్పష్టమైంది.
తీవ్రవాదులు, ఇతర భారీ నేరాల్లో శిక్ష పడిన ఖైదీలకు అనారోగ్యం తలెత్తినప్పుడు ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల ప్రిజనరీ వార్డులకు తరలిస్తుంటారు. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, నిమ్స్, ఎర్రగడ్డలోని మానసిక చికిత్స ఆలయంలో తరచూ ఏవో ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అన్నింటి వద్ద 24 గంటలపాటు పొరుగు సేవల సంస్థలు ప్రైవేటు సెక్యూరిటీ అందుబాటులో ఉంటుంది. వీరిపై ఎలాంటి పర్యవేక్షణ ఉండటం లేదు. అన్ని ఆసుపత్రుల వద్ద సీసీ కెమెరాలు ఉన్నాసరే...అందులో 30-40 శాతం పని చేయడం లేదు.
2004లో గాంధీ ఆసుపత్రి నుంచి ఓ మహిళ చిన్నారిని ఎత్తుకెళ్లడం సంచలనం రేపింది. పాపను ఆడిపిస్తానని తీసుకొని పారిపోయింది. పోలీసులు రంగంలోకి దిగి తెనాలిలో పట్టుకున్నారు.
గాంధీలో ఇప్పటివరకు మూడుసార్లు తెల్లకోట్లు, మెడలో స్టెతస్కోపులతో నకిలీ వైద్యులు హల్చల్ చేశారు.
గాంధీ కొవిడ్ ఆసుపత్రిగా మారకముందు ప్రైవేటు ఆసుపత్రుల ఏజెంట్లు తిష్ఠవేసి రోగులను తరలించుకెళ్లేవారు. కొందరు ల్యాబ్ల సిబ్బంది రోగుల నమూనాలు సేకరించి పరీక్షలు చేయించి డబ్బులు గుంజేవారు.
ఉస్మానియా ఆసుపత్రిలో మద్యం తీసుకొచ్చి రోగులకు ఇవ్వడం, వారితో కలిసి తాగడం తరచూ బయటపడుతోంది. ఇక్కడా 30 శాతం వరకు కెమెరాలు పనిచేయడం లేదు.
2018లో ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం నుంచి 11 మంది ఖైదీలు గోడకు కన్నమేసి పారిపోయారు. అంతకుముందు కూడా ఇలాంటివి జరిగాయి.
- ఇదీ చూడండి : కారు బీభత్సం: ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు