మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ విభాగాధిపతులతో మంత్రి కేటీఆర్ టెలీకాన్ఫిరెన్స్ నిర్వహించారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో అధికారులకు పలు సూచనలు చేశారు. పట్టణాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేశారు. పారిశుద్ధ్య సిబ్బంది, వైద్య శాఖాధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పాడైపోయిన రోడ్ల మరమ్మతులను వెంటనే ప్రారంభించాలని స్పష్టం చేశారు.
ఇళ్లు లేని వారిని..
రూ.5 భోజనం కొనసాగించాలని సూచించారు. కౌంటర్ల వద్ద ప్రజలు గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇళ్లు లేని వారిని ఆయా పట్టణాల్లోని నైట్ షెల్టర్లకు తరలించాలన్నారు. ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్న వారు ఇళ్లకే పరిమితమయ్యేలా వారిపైన నిఘా ఉంచాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లను మంత్రి కోరారు.
సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు..
పారిశ్రామిక వాడల్లో, ఐటీ పార్కుల్లో నిరంతరం పారిశుద్ధ్య పనులను కొనసాగిస్తూ.. మరింత ప్రాధాన్యత ఇవ్వాలని అదేశించారు. ఈ మేరకు టీయస్ఐఐసీ అధికారులు ప్రత్యేక కార్యచరణ చేపట్టాలన్నారు. పారిశ్రామిక వాడల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, రోజూవారీ కూలీల వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను ఉపయోగించేందుకు ముందుకు రావాలని కేటీఆర్ కంపెనీలను కోరారు.
బ్యాండ్ విడ్త్ను పెంచండి..
లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమైనందున ఇంటర్నెట్ వినియోగం పెద్ద ఎత్తున పెరిగింది. డిమాండ్ను తట్టుకునేందుకు అవసరమైన మేరకు బ్యాండ్ విడ్త్ను పెంచాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను మంత్రి విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ సందర్భంగా అత్యవసర సేవలతో పాటు వివిధ రంగాల్లో పనిచేస్తోన్న వారికి ఎదురవుతోన్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని మంత్రి పేర్కొన్నారు. వారి విషయంలో పోలీసు సిబ్బంది కొంత సానుకూలంగా వ్యవహరించేలా చూడాలని హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిని కేటీఆర్ కోరారు.
ఇవీ చూడండి: జ్వరం వస్తే.. కరోనా పరీక్షలు చేయాల్సిందే