ప్లాట్లు కొన్న పేదల దగ్గర స్లాబ్ రేట్ల పేరుతో వందకు వంద శాతం అపరాధ రుసుం వసూళ్లు చేయడాన్ని... కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి తప్పుబట్టారు. ప్రభుత్వ ఖజానాకు అదనపు ఆదాయం తెచ్చిపెట్టే ప్లాట్ల క్రమబద్దీకరణ... కొనుగోలుదారులకు తీవ్ర ఆర్థిక పెను భారమని ఆరోపించారు. కబ్జాదారులకు, భూముల అక్రమ వ్యాపారం చేసే వాళ్లకు కాసుల పంట కురిపించే కల్పతరువు లాంటిదని విమర్శించారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం... ప్లాట్ల కొనుగోలుదార్లకు న్యాయం చేసేందుకు 2008లో జీవో-113 తెచ్చి నామమాత్రపు అపరాధ రుసుంతో క్రమబద్దీకరించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సంవత్సరంలో జీవో-151 విడుదల చేస్తూ అపరాధ రుసుం విధించిందని ఆరోపించారు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన జీవోతో దేవదాయ, భూధాన, అటవీ భూములు ఆక్రమించుకుని అక్రమంగా లే అవుట్లు వేసిన వారంతా ప్రయోజనం పొందుతారని ఆందోళన వ్యక్తం చేశారు.
భూమి పత్రాలు తనిఖీ చేసి... లే అవుట్లు వేసిన వారి దగ్గరి నుంచే అపరాధ రుసుము వసూలు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలుదారులపై ఒక్కపైసా ఆర్థిక భారం పడకుండా... హెచ్ఎండీఏ, గ్రామపంచాయతీ నిబంధనలు పాటించి... అంతర్గత రహదారులు, సెప్టిక్ ట్యాంకులు, పార్కులు వంటి ఏర్పాటు స్థిరాస్థి వ్యాపారులపై బాధ్యత పెట్టి... పాటించని వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.