హైదరాబాద్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన వానకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. వరద నీటితో కాలనీలు కాలువలను తలపిస్తున్నాయి. లోతట్టు వీధులు చెరువుల్లా మారాయి. హయత్నగర్ డిపో ప్రాంతం రాత్రి నుంచి జలదిగ్బంధం అయ్యింది. వర్షపు నీటి ప్రవాహంతో జనాలు నిత్యావసాలకు కూడా అడుగు బయటపెట్టలేని పరిస్థితి ఏర్పడింది.
చేప పిల్లల వెంట పిల్లల పరుగులు...
ప్రస్తుతం వర్షం ఆగిపోవటం వల్ల ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటి ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. అయితే అన్ని ప్రాంతాల్లో జనాలు వరద నీటితో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. హయత్నగర్లో స్థానికులు మాత్రం చేపల వేట సాగిస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న నీళ్లలో చేపలు కొట్టుకువస్తున్నాయి. శాంతినగర్ కాలనీలోని కోర్టు, డిపోల ముందున్న రోడ్డుపై ప్రవాహ ఉద్ధృతి తగ్గిపోవటం వల్ల స్థానికులు... బయటకు వచ్చి గమనించగా... చేపలు కనిపించాయి. వెంటనే పిల్లలు పెద్దలు ఇక చేపల వెంట పడ్డారు. నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చిన చేప పిల్లలను పట్టేందుకు... పరుగులు పెట్టారు. చిన్నారులైతే సంతోషంతో కేరింతలు కొడుతూ... చేపల వేట సాగించారు.
కాసేపు సందడి...
ఎగువ ప్రాంతంలోని చెరువుల్లో ఉన్న చిన్నచిన్న చేప పిల్లలు ప్రవాహానికి కొట్టుకురాగా... వాటిని పట్టేందుకు స్థానికులు ప్రయత్నించారు. కొందరికి చేపలు దొరకగా మరికొందరు నిరుత్సాహంతో వెనుదిరిగారు. ఏదేమైనా... పిల్లలు, పెద్దలు కలిసి చేసిన చేపల వేట.. కాసేపు సందడి నెలకొంది.
నీళ్లు తొలగించేందుకు తీవ్ర శ్రమ..
బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. హయత్నగర్లోని రెండు ఆర్డీసీ బస్ డిపోల సమీపంలోని కోర్టు, అగ్నిమాపక కేంద్రంలోకి భారీగా వరద వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతం కావడంతో హయత్నగర్ ఆర్టీసీ డిపో... చెరువును తలపించింది. డిపోల నుంచి బస్సులు బయటకి తీయడానికి డ్రైవర్లు ఇబ్బందులు పడ్డారు. డిపోలోని డీజిల్ బంక్ సగానికి పైగా మునిగిపోయింది. పలు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లల్లోకి వెళ్లడంతో... స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నీటిని తొలగించేందుకు తీవ్రంగా శ్రమించారు.