ఏపీలోని విజయవాడ గుణదల విద్యుత్ ఉపకేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించి.. మంటలను అదుపులోకి తేవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఆరుబయట పడేసిన ప్లాస్టిక్ బాక్సులు, ఇతర వస్తువులు కాలిపోయి.. పాత ట్రాన్స్ఫార్మర్కు మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగ చుట్టుపక్కలకు వ్యాపించాయి.
పెరిగిన ఉష్ణోగ్రతలు
మూడు రోజులుగా విజయవాడలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆరుబయట ఉన్న ఎండుగడ్డి కాలి మంటలు చెలరేగి ప్లాస్టిక్బాక్సుల వరకు చేరాయి. దీంతో ఒక్కసారిగా అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
అగ్నిమాపక సిబ్బంది సూచనలు
కొన్నేళ్లుగా మే నెలలో ఈ తరహా ప్రమాదం.. గుణదలలోని స్టోర్స్ ప్రాంగణంలో జరుగుతోంది. గత సంవత్సరం మాత్రమే ఈ తరహా ప్రమాదం జరగలేదు. ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు తీవ్రంగా ఉండడంతో మరోసారి ప్రమాదం సంభవించింది. ప్రమాదాలు జరగకుండా విద్యుత్ శాఖ అధికారులకు.. ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక సిబ్బంది సూచించింది.
ఇదీ చదవండి: ఉపఎన్నికలో తెరాసకు తగిన బుద్ధి చెప్పాలి: జానారెడ్డి