ఫిబ్రవరి 1నుంచి కోవిడ్ నియంత్రణా చర్యలు పాటిస్తూ విద్యాసంస్థలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో 9,10 వ తరగతి... ఇంటర్, డిగ్రీ సహా ఇతర వృత్తివిద్యా కోర్సుల నిర్వహణకు విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. పాఠశాలలు, కళాశాలల ప్రారంభంపై కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేసేందుకు కలెక్టర్ల నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసిన విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి చిత్రారామచంద్రన్... ఈ నెల 18లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు... ప్రత్యక్ష తరగతులు నిర్వహించరాదన్న విద్యాశాఖ... ఆయా తరగతులకు డిటెన్షన్ విధానం ఉండదని స్పష్టంచేసింది.
తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి
పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపింది. అన్ని విద్యాసంస్థల్లో శానిటైజర్లు, థర్మామీటర్లు, మాస్కులను అందుబాటులో ఉంచాలని... మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. విద్యార్థుల మధ్య ఆరడుగుల భౌతిక దూరం తప్పనిసరన్న విద్యాశాఖ... ఒక్కో బెంచిపై ఒకే విద్యార్థి కూర్చోవాలని స్పష్టం చేసింది. పాఠశాలల్లో తరగతి గదిలో 20 మందికి మించరాదని పేర్కొంది. విద్యార్థులను పాఠశాలలకు పంపే విషయంలో... తల్లిదండ్రుల నుంచి లిఖిత పూర్వక హామీ కచ్చితంగా తీసుకోవాలని పేర్కొంది. విద్యా సంస్థలు ప్రారంభమైన తర్వాత కూడా....ఆన్ లైన్ బోధన కొనసాగించాలని... స్పష్టం చేసింది. ఈ ఏడాది పరీక్షలు రాసేందుకు... కనీస హాజరు నిబంధన ఉండదని వెల్లడించింది. పాఠశాలల వేళలు గతంలో మాదరిగానే ఉంటాయని... కలెక్టర్ల సహకారంతో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని... మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
షిఫ్టు విధానంలో తరగతులు
జూనియర్ కాలేజీలకు సంబంధించి... 300లోపు విద్యార్థులున్న కళాశాలల్లో ఉదయం 9.30గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు తరగతులు నిర్వహించవచ్చు. 300 మంది విద్యార్థులకు మించి ఉంటే... షిఫ్టు విధానంలో తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం ఎనిమిదిన్న నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఇంటర్ రెండో సంవత్సరం... మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు మొదటి సంవత్సరం తరగతులు జరపాలని పేర్కొంది. అవసరమైతే షిఫ్టులను మార్చుకోవచ్చని సూచించింది. ఒక్కో గదిలో... 30మందికి మించరాదని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
కనీస హాజరు తప్పనిసరి కాదు
ఇంటర్మీడియట్ పరీక్షల విధానంలో మార్పులు ఉండవని.. ప్రశ్నల్లో ఛాయిస్లు ఎక్కువగా ఇవ్వాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ తెలిపింది. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, వృత్తి విద్యా కళాశాలల్లో... రోజుకు సగం మంది విద్యార్థులతో తరగతులు నిర్వహించాలని... స్పష్టం చేసింది. ఈ సెమిస్టర్కు కనీస హాజరు తప్పనిసరి కాదని వెల్లడించింది. విద్యా సంస్థల్లో రెండు ప్రత్యేక ఐసోలేషన్ గదులను అందుబాటులో ఉంచడం సహా... కొవిడ్ లక్షణాలు ఉంటే విద్యార్థులను అనుమతించవద్దని స్పష్టం చేసింది. విద్యార్థుల్లో... కొవిడ్ లక్షణాలు కనిపిస్తే.. ఎక్కడికి తరలించాలి... మిగతా వారికి సోకకుండా ఏం చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కార్యాచరణ రూపొందించాలని... కలెక్టర్ల అనుమతి లేకుండా విద్యా సంస్థల్లో రాజకీయ సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: 300కి పైగా విద్యార్థులు ఉంటే షిప్టు విధానం.. విద్యా శాఖ మార్గదర్శకాలు